అమరావతి రైతుల మరో యాత్ర- ఈసారి ఢిల్లీలో - ధరణి కోట టూ ఎర్రకోట.. !
ఏపీలో ఇప్పటికే అమరావతి నుంచి తిరుమలకు, మరోసారి అరసవిల్లికి యాత్రలు చేపట్టిన రాజధాని రైతులు మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. తిరుమల యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న రైతులు, అరసవిల్లికి చేపట్టిన యాత్ర మాత్రం మధ్యలోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మూడో యాత్రకు రెడీ అవుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియ మొదలుపెట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేపట్టి తమ గళం వినిపించాలని రైతులు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టడం ద్వారా ఎంపీల దృష్టిని ఆకర్షించాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని అమరావతి రైతు పరిరక్షణ సమితి నిర్ణయించింది. ఈ మేరకు వారు ధరణికోట టూ ఎర్రకోట పేరుతో ర్యాలీ నిర్వహించబోతున్నారు.

ఈ నెల 17న రైల్లో ఢిల్లీ చేరుకోనున్న 1800 మంది రైతులు.. అదే రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత 18న ఇతర రాష్ట్రాల ఎంపీల్ని కలిసి అమరావతి రాజధానిపై మద్దతు కోరబోతున్నారు. అనంతరం 19న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కిసాన్ సంఘ్ తో కలిసి బహిరంగసభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అనంతరం అమరావతికి తిరిగి రానున్నారు.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియను మొదలుపెట్టినప్పటికీ ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతోంది. ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టును కూడా చేరింది. హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సిద్ధంగా లేని వైసీపీ సర్కార్.. దీన్ని కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిర్ణీత సమయంలో అమరావతి పనులు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన గడువుపై సుప్రీంకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకుంది. అదే సమయంలో అరసవిల్లికి రైతులు చేపట్టిన పాదయాత్ర పలు కారణాలతో నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications