అంతా రామమయం: సముద్రగర్భంలో నిలువెత్తు శ్రీరాముడు; లక్షకు పైగా మొక్కలతో ఠీవిగా శ్రీరాముడు!!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా పూర్తయింది. అయోధ్య రామ మందిరంలో బాల రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్టతో దేశమంతా పులకించింది. బాలరామయ్య దర్శనంతో జగమంతా ఉప్పొంగిపోయింది. ఆ శ్రీ రామ చంద్రుని దివ్యరూప దర్శనంతో భారతావని పులకరించింది. చిరుదరహాసం, ప్రసన్నవదనం, స్వర్ణాభరణాలతో బాలరామయ్య దర్శనమిచ్చారు. ఆ దివ్య మనోహర రూపాన్ని చూసేందుకు కళ్ళు చాలవు అన్నట్టు ఆయన రూపం ఉంది.
అయోధ్య రామయ్య వేడుకకు అనుబంధంగా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరికి వారు రాముడిపై తమ భక్తిని చాటుకున్నారు. అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగితే విశాఖకు చెందిన స్కూబో డైవర్లు తమ దైన రీతిలో భక్తిని చాటుకున్నారు. రుషికొండ సముద్ర గర్భంలో నిలువెత్తు శ్రీరాముని రూపాన్ని నీటి అడుగువరకూ తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్టించి ఆరాధించారు. 22 అడుగుల లోతులో ఈ కార్యక్రమం జరిగింది.

లైవ్ ఇన్ అడ్వెంచర్స్కు చెందిన డైవర్లు ఈ సాహస కృత్యం చేశారు. లైవ్ ఇన్ అడ్వెంచర్స్ వ్యవస్థాపకుడు బి. బలరాం నాయుడు అతని బృందం తమ ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ స్వాగతించి సాగర శ్రీరాముడిని దర్శించుకోవాలంటూ వీడియోలను విడుదల చేశారు. సాగర మధ్యలో సాహసం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీలో వివిధ రకాల మొక్కలతో శ్రీరాముని చిత్రం, అయోధ్య రామమందిరం చిత్రాలను మొక్కల కూర్పుతో ఏర్పాటుచేశారు. 70 అడుగుల పొడవుతో ఏర్పాటుచేసిన ఈ చిత్రాలకోసం దాదాపు లక్షకుపైగా వివిధరకాల మొక్కలను వినియోగించినట్లు నర్సరీ రైతు పెదసత్యనారాయణ వివరించారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని పురష్కరించుకుని మొక్కలతో అయోధ్య రామున్ని ఏర్పాటు చేశామన్నారు.

ఇదిలా ఉంటే అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరగడంతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈరోజు సాయంత్రం భక్తులు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించారు. రామనామస్మరణలు చేసుకుంటూ వెయ్యికి పైగా దీపాలను వెలిగించారు. శ్రీరామ, రామ ఆకృతిలో వెలిగించిన దీపాలు అందరిని ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పెద్ద జియ్యంగార్లు కూడా దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications