టీడీపీలో ఆగస్టు సంక్షోభం - అమిత్ షా పావులు..కలకలం!!
అమరావతి: తెలుగుదేశం పార్టీకి- ఆగస్టు నెలకు అవినాభావ సంబంధం ఉందని చరిత్ర చెబుతోంది. ఆ పార్టీలో ఏర్పడిన సంక్షోభాలన్నీ ఈ నెలలో ఉత్పన్నమైనవే. ఆగస్టు అంటే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతుంటారు. ఎన్టీ రామారావును గద్దె దించి నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆగస్టు నెలలో ఏదో ఉపద్రవం ముంచుకొస్తూనే ఉంటుందీ ఆగస్టు నెలలో. నెలరోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు.

అన్నీ ఆగస్టులోనే..
ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తిరుగుబాటు లేవనెత్తింది కూడా ఆగస్టులోనే. సెప్టెంబర్ 1న ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబును ఇప్పటికీ వెంటాడుతూనే వస్తోన్న వామపక్ష పార్టీల విద్యుత్ ఉద్యమం చోటు చేసుకున్నది కూడా ఆగస్టులోనే. ఆగస్టు 29వ తేదీన బషీర్ బాగ్ వద్ద వామపక్ష ఉద్యమకారులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది.

అమిత్ షా రూపంలో సంక్షోభానికి బీజం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిందీ ఈ నెలలోనే. ఆ తరువాత ఆయన ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితిని నెల్పకొల్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి సంక్షోభ పరిస్థితులకు ఈ ఆగస్టులో కూడా బీజం పడినట్టే కనిపిస్తోంది.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రూపంలో. నందమూరి కుటుంబ వారసుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా భేటీ కావడం.. అదీ ఆగస్టులోనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

తీవ్రత అర్థమౌతోంది..
అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడాన్ని తెలుగుదేశం పార్టీ తొలుత తేలిగ్గా తీసుకున్నప్పటికీ..క్రమక్రమంగా దాని తీవ్రతను అర్థం చేసుకుంటోంది. ఈ భేటీపై ఎవరూ స్పందించవద్దంటూ టీడీపీ అగ్ర నాయకత్వం ముందుగానే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. అటు బుద్ధా వెంకన్న వంటి నాయకులు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ భేటీని తాము ఆర్ఆర్ఆర్ సినిమాపరంగా మాత్రమే చూస్తోన్నామని ఆయన వ్యాఖ్యానించారు.

వ్యక్తిగతంగా దూషిస్తూ..
టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తోన్న సోషల్ మీడియా విభాగంలో జూనియర్ ఎన్టీఆర్పై ట్రోల్స్ పోటెత్తాయి. ప్రత్యేకించి- నారా లోకేష్ టీమ్ ఈ భేటీపై నిప్పులు చెరిగింది. ఆయనను వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పడ్డాయి. బీజేపీతో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తోంటే.. దీనికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా ముందు చేతులు కట్టుకుని నిల్చున్నాడంటూ ధ్వజమెత్తారు లోకేష్ టీమ్ ప్రతినిధులు.

రాజకీయ కోణంలోనే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయ కోణంలో దీన్ని చూస్తోన్నారు. అమిత్ షా వంటి బడా నాయకుడు ఒక్క నిమిషం కూడా వృధా చేయబోరని, రాజకీయ కారణాలు లేనిదే ఏ పనీ చెయ్యరని స్పష్టం చేస్తోన్నారు. రాజకీయాల కోసమే జూనియర్ ఎన్టీఆర్ను కలిశారని తేల్చి చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనను పార్టీ సేవల కోసం వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదని అంటోన్నారు.

చీలిక ఆయనకే సాధ్యం..
భవిష్యత్లో తెలుగుదేశం పార్టీలో చీలిక రావడం అంటూ జరిగితే- అది జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమేననే అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబుకు వయస్సు మీద పడటం, తదుపరి నాయకుడిగా నారా లోకేష్ను మెజారిటీ కార్యకర్తలు అంగీకరించకపోవడం వల్ల భవిష్యత్తులో టీడీపీ మళ్లీ నందమూరి కుటుంబం చేతికి వెళ్లే అవకాశాలు లేకపోలేదని, దీనికి అమిత్ షా కూడా సహకరిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ పగ్గాలను జూనియర్కు అప్పగించాలనే డిమాండ్ ఉంది.












Click it and Unblock the Notifications