ర్యాలీగా సిటీకి అమిత్షా, తుమ్మలకి ఎర్రబెల్లి బుజ్జగింపు
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం మధ్యాహ్నం హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ర్యాలీగా సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ దిశగా సాగుతోంది. ఇంపీరియల్ గార్డెన్లో అమిత్ షాకు అభినందన సభ జరగనుంది.
శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అమిత్ షా తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడంతో పార్టీ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనా రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు కార్యకర్తలు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.
రాత్రి తెలంగాణ బీజేపీ పదాధికారులతో ఆయన భేటీ కానున్నారు. సమావేశ ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా, గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టపరచడమే లక్ష్యంగా అమిత్ షా రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
తుమ్మలకు బుజ్జగింపు
తుమ్మల నాగేశ్వర రావు తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో... ఆయనను పార్టీ సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నారు. తుమ్మల నివాసానికి ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర రావులు గురువారం వెళ్లి మాట్లాడారు. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడనున్నారని చెబుతున్నారు.