టీడీపీపై అమిత్ షా మరో క్లారిటీ- తిరుపతి బీజేపీ నేతల భేటీలో-ఇక తేలిపోయినట్లేనా?
ఏపీలో బీజేపీ, టీడీపీ మధ్య గతంలో పొత్తు ఉండేది. 2019 ఎన్నికలకు ఏడాది ముందే వైసీపీ వ్యూహంలో చిక్కుకుని బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ.. ఆ తర్వాత ఆ పార్టీపై ధర్మపోరాటం ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబును బీజేపీ సీబీఐతో అరెస్టు చేయిస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. చివరికి సీబీఐని కూడా రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీల్ని కలుపుకుని బీజేపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు విఫలయత్నం చేశారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ వైఖరిలో మార్పు వచ్చేసింది.
సీన్ కట్ చేస్తే ప్రస్తుతం బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోంది. ఇదే క్రమంలో పట్టాభి వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు రెచ్చిపోయిన ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. అయితే అప్పటికే శ్రీనగర్ లో ఉన్న అమిత్ షా ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేకపోయారు.
ఆ తర్వాత టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఇదే విషయాన్ని అమిత్ తో కలిసి ప్రస్తావించగా.. తర్వాత కలుద్దామని చెప్పి పంపేశారు. ఇప్పుడు అమిత్ షా రాష్ట్రానికే వచ్చారు, అయినా చంద్రబాబు కానీ, టీడీపీ కానీ నోరెత్తడం లేదు. అదే సమయంలో బీజేపీ నేతలకు తిరుపతిలో దిశానిర్దేశం చేసిన అమిత్ షా ..టీడీపీతో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు.
ప్రస్తుతం అధికార వైసీపీతో రాజకీయంగా రాష్ట్రంలో దూరం పాటిస్తున్న బీజేపీ.. టీడీపీ విషయంలోనూ సమానదూరం పాటించాలని తనను కలిసిన బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు చెప్పేశారు. దీంతో బీజేపీతో మళ్లీ కలిసేందుకు టీడీపీ తాజాగా చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టినట్లయింది. అలాగ్ టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి మరోమారు స్పష్టమైంది. అదే సమయంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే విషయంలోనూ బీజేపీ నేతలకు అమిత్ షా పలు సూచనలు చేశారు. ఇందులో జనసేనతో కలిసి ఈ ఎన్నికలు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాలని సూచించారు.