చంద్రబాబు ఎదుటే.. ఆనం బ్రదర్స్కి సోమిరెడ్డి చురకలు: ఎవరికి షాక్?
విజయవాడ: ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం సోదరులు (ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి)లు వేలాదిమంది తమ అనుచరులను విజయవాడ వేదికగా టిడిపిలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఆనం సోదరుల చేరికతో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో టిడిపిలో ఆనం సోదరులు వర్సెస్ సోమిరెడ్డిగా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. ఆనం సోదరుల చేరికతో సోమిరెడ్డి ప్రభావం కొంత తగ్గవచ్చునని చాలామంది భావిస్తున్నారు.
విజయవాలో పెద్ద ఎత్తున తమ కార్యకర్తలను ఆనం సోదరులు చేర్పించడమే అందుకు కారణంగా చెబుతున్నారు. విజయవాడలోనే ఇంత మంది వచ్చారని, అదే నెల్లూరులో అయితే మరింత ఎక్కువ మంది వచ్చే వారని ఆనం సోదరులు ఈ సందర్భంగా చెప్పారు.
తద్వారా సోమిరెడ్డి పైన పైచేయి సాధించాలనేది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ఆదివారం నాడు ఆనం సోదరుల అనుచరుల చేరిక సమయంలో బహిరంగ సభలోనే ఆనం బ్రదర్స్, సోమిరెడ్డి మధ్య పరోక్షంగా మాటల యుద్ధం కనిపించింది.
ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు మాత్రమే టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారని, 2019 ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకునేలా కృషి చేద్దామని వ్యాఖ్యానించారు.
దీనికి సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో మూడు సీట్లే గెలిచామని చెబుతున్నారని, సరే. 1989లో మీరు టీడీపీలోనే ఉన్నారని, అప్పుడు ఒక్క సీటు కూడా రాలేదని, ఆపై 1994లో (ఆనం సోదరులు కాంగ్రెస్లో ఉన్నారు) జిల్లాలో మొత్తం సీట్లను మేం గెలుచుకున్నామని కౌంటర్ ఇచ్చారు.
తాను సోమిరెడ్డి నాయకత్వంలోనూ పని చేస్తానని ఆనం సోదరులు వ్యాఖ్యానించారు. దానికి సోమిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వం మాత్రమే ఉంటుందని చెప్పారు. కాగా, చంద్రబాబూ మాట్లాడుతూ.. ఈ సభ చూస్తుంటే నెల్లూరు జిల్లా కదిలివచ్చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఇది ఆనం సోదరులకు చంద్రబాబు కితాబేనని చెప్పవచ్చు.