జైల్లో ఉండి వచ్చి, సీఎం పదవా: ఆనం, జగన్ పైకి కార్యకర్తలు, ఆపిన లోకేష్
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వైసిపి అధినేత జగన్ పైన టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం నాడు నిప్పులు చెరిగారు. జైల్లో ఉండి వచ్చిన జగన్ ముఖ్యమంత్రి పదవికి ఏనాడు పోటీదారు కాలేరని చెప్పారు.
సభ్యత, సంస్కారం తెలియని వ్యక్తి ప్రతిపక్షనేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. ప్రతిపక్ష నేత పదవి పైన ప్రజలకు గౌరవం ఉందని, లేదంటే ఈ పాటికే జగన్కు తగిన సత్కారం చేసేవారన్నారు. జగన్ వ్యవహారశైలి కారణంగా రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోతున్నాయన్నారు.
అక్రమార్కులను రాజకీయ నాయకులుగా జగన్ తయారు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఏ2 నిందితుడిని పార్లమెంట్కు పంపించడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రికి ప్రతిపక్షనేత తగిన గౌరవం ఇస్తేనే తనకు గౌరవం లభిస్తుందన్న విషయం జగన్ తెలుసుకోవాలన్నారు.
ఇవేం మాటలు: కామినేని
ప్రతిపక్ష నేత హోదాలో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి కామినేని శ్రీనివాస్ రావు అన్నారు. ఒక పార్టీకో, ఓ గ్రూపుకో ముఖ్యమంత్రి కాదని ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు ఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాన్ని జగన్ గుర్తించకపోవడం దౌర్భాగ్యమన్నారు. తీరు మార్చుకోకపోతే జగన్ వ్యాఖ్యలు చేసిన రీతిలోనే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, అది మరెంతో దూరం లేదన్నారు.
జగన్ తాత, తండ్రిదీ నేర చరిత్రే: సీఎం రమేష్
జగన్ తాత, తండ్రిది కూడా నేర చరిత్రేనని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. జగన్కు టిడిపి కార్యకర్తలు తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉండటమే ఓ శాపం అన్నారు.
టిడిపి కార్యకర్తలకు లోకేష్ సూచన
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జగన్ పైన టిడిపి నేతలు మండిపడుతున్నారు. అనంతపురంలో టిడిపి కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పైకి చెప్పులు విసిరారు. ఆయన వెళ్తుంటే చెప్పులు చూపిస్తున్నారు. జగన్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జగన్ క్షమాపణ చెప్పకుంటే రానివ్వమంటూ టిడిపి కార్యకర్తలు పలుచోట్ల రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ స్పందించారు.
ఆయన ట్విట్టర్లో స్పందించారు. టీడీపీ శ్రేణులను వైసిపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, అనంతపురంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. వైసిపి రాష్ట్ర వ్యతిరేకని ఆరోపించారు. మన శక్తియుక్తులన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగిద్దామన్నారు. జగన్ వ్యాఖ్యలకు తీవ్రంగా రెచ్చిపోవద్దని, నిగ్రహంగా ఉండాలని సూచించారు.