జగన్ అంటే 420, ఓదార్పు పేరుతో ఏడిపిస్తున్నారు: ఆనం వివేకా మార్క్ వ్యాఖ్య
నెల్లూరు/ విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి తనదైన ప్రత్యేకమైన పద్ధతిలో విరుచుకుపడ్డారు. జగన్ అంటే 420 అని, 420 అంటే జగన్ అని ఎద్దేవా చేశారు.
ప్రజలు కూడా అలానే అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పచ్చి మోసగాడు అని విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. నెలలో రెండు సార్లు అయినా జైలు ముఖం చూడకుంటే జగన్కు గడవదని ఆయన విమర్శించారు.
ఓదార్పు యాత్ర పేరుతో ప్రజలను ఏడిపిస్తున్నారని తన దైన శైలిలో వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మంచి చేసి ప్రజల్లో ప్రతిపక్ష నాయకుడు అని అనిపించుకోవాలని ఆయన సూచించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రహస్య ఒప్పందం మేరకే ముద్రగడ పద్మనాభం కాపు గర్జన సభ నిర్వహిస్తున్నారని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ ఆరోపించారు. రాజకీయంగా సన్యాసం స్వీకరించి 20ఏళ్ల పాటు ఇంట్లో కూర్చున్న వ్యక్తికి హఠాత్తుగా కాపులపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పాలని తోట నగేశ్ డిమాండు చేశారు.
ఉత్తరాంధ్రలో కాపులకు బీసీ-డి సర్టిఫికెట్ ఇస్తున్నారని, రిజర్వేషన్ ఖరారు చేస్తే వారిని ఏ స్థానంలో ఉంచుతారో స్పష్టం చేయాలని ఆయన కోరారు.