ఆనందయ్య మందుపై మరో ట్విస్ట్- పంపిణీకి బ్రేక్-రోగులు రావొద్దంటున్న అనుచరులు
నెల్లూరు ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద కోవిడ్ మందు పంపిణీ జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్ కాంప్లెక్స్లో మందు తయారీ జరుగుతుండగా.. దీన్ని సవ్యంగా పంపిణీ చేసే విషయంలో ప్రభుత్వానికీ, ఆనందయ్యకూ పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరులు ఇవాళ రంగంలోకి దిగారు. ఆనందయ్య మందు పంపిణీ లేదని, కరోనా రోగులెవరూ సోమవారం రావొద్దంటూ వీడియోలు విడుదల చేస్తున్నారు.
ఆనందయ్య మందు తయారీకి ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. రోజుకు కేవలం 4 వేల మందికే తాము మందు పంపిణీ చేయగలమని వారు చెప్తున్నారు. ప్రజలకు ఈ మందు పంపిణీ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వ సహకారం లేనిదే ఇది సాధ్యం కాదని ఆనందయ్య ప్రధాన అనుచరుడు సంపత్ రాజ్ ఇవాళ వీడియోలో తెలిపారు. ఇప్పటికే స్ధానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో రహస్యంగామందు తయారు చేసి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మిగతా జనాలకు మందు తయారీ చేయాలంటే ప్రభుత్వ సహకారం కావాలని అనుచరులు కోరుతున్నారు.
ఆనందయ్య మందును ఆన్లైన్లో రాష్ట్రమంతా పంపిణీ చేస్తామని ఓవైపు ప్రభుత్వం చెప్తుండగా.. ఆయన అనుచరులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఆన్లైన్లో ఆనందయ్య మందు పంపిణీ అనేది తప్పుడు సమాచారమని వారు చెప్తున్నారు. ఆనందయ్య స్వయంగా ప్రకటించే వరకూ మందు తయారీపై కూడా ఎలాంటి నిర్ణయాలు ఉండబోవని ఆయన అనుచరులు తెలిపారు. దీంతో ముందుగా చెప్పినట్లు సోమవారం నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి వస్తుందా లేదా అన్న దానిపై కోవిడ్ రోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.