అనంతపురం కోర్టు సంచలనం: 3 రోజులు.. 3 కేసులు.. యావజ్జీవ శిక్షలు!
అనంతపురం: చిన్నారులపై అఘాయిత్యాలకు బరితెగిస్తున్న మానవ మృగాలపై అనంతపురం ప్రత్యేక న్యాయస్థానం కొరడా ఝళిపిస్తోంది. యావజ్జీవ కారాగార శిక్షలతో హడలెత్తిస్తోంది.
ఈ నెల 3 నుంచి వరుసగా మూడ్రోజులపాటు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షలు విధించి ప్రత్యేక న్యాయస్థానం సంచలనం సృష్టించింది. వేర్వేరు కేసుల్లో నిందితులకు వరుసగా ఈ రకమైన శిక్షలు పడడం, అది కూడా బాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కావడం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బుధవారం బత్తలపల్లికి చెందిన శ్రీరాములు, గురువారం కంబదూరుకు చెందిన రామాంజనేయులు, శుక్రవారం పుట్టపర్తికి చెందిన ముత్యాలుకు అనంతపురం ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడంపై బాధిత వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఇలాంటి నేరాల్లో కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. బాధితుల పక్షాన కేసులను వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుడేన్సాబ్ను న్యాయవాదులు, బాధితులు అభినందించారు.
చెప్పులు మరిచిపోయి వెనక్కి వచ్చినందుకు...
దళిత బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన కురుమల చిన్న ముత్యాలుకు యవజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ స్థానిక అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది. పుట్టపర్తికి చెందిన చిన్న ముత్యాలు అక్కడి మండల పరిషత్తు పాఠశాలలో అటెండర్గా పనిచేస్తూ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
నాలుగో తరగతి చదువుతున్న ఆ బాలిక హాస్టల్లో ఉండేది. 2015 సెప్టెంబర్ 14న మధ్యాహ్నం పాఠశాల ముగిశాక బాలిక తన సోదరితో కలిసి ఇంటికి బయలుదేరింది. చెప్పులు మరిచిపోవడంతో తిరిగి పాఠశాలకు వచ్చింది.
ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్న ముత్యాలు సదరు బాలికను బాత్రూమ్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగింది ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలిక విషయాన్ని హాస్టల్ వార్డెన్కు, ఇంట్లో తన తల్లికి తెలుపగా మర్నాడు ఉదయం పుట్టపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో నిందితుడు చిన్న ముత్యాలును పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి విచారణలో భాగంగా 12 మంది సాక్షులను విచారించారు. చివరికి నిందితుడిపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50 వేల జరిమానా విధించారు.
ఎస్టీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద మరో రూ.50 వేల జరిమానా, అత్యాచారానికి ఐదేళ్ల జైలుశిక్ష్, మరో రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శశిధర్ రెడ్డి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కో కేసుకు ఆరు నెలల చొప్పున అదనంగా జైలుశిక్ష్ అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.