వజ్రాలు, 5తలల నాగేంద్రుడు: రూ.కోట్ల పంచలోహ శివలింగం స్వాధీనం, అరెస్ట్
విజయవాడ: రూ.కోట్లు విలువ చేసే పంచలోహ శివలింగ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ శివలింగంలో 87 వజ్రాలు పొదిగి ఉన్నాయి. అయిదు తలల నాగేంద్రుడు ఉన్న శివలింగం అది. ఇది పురాతన విగ్రహంగా పోలీసులు భావిస్తున్నారు.
గురువారం రాత్రి నరసింహా రెడ్డి, వెంకట దుర్గాప్రసాద్, శివనాగేంద్ర, వెంకన్న బాబు, శ్రీనుల నుంచి పోలీసులు శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేశారు. వారు కొన్ని రోజులుగా తమ వద్ద పంచలోహ విగ్రహం ఉందని వాట్సాప్ ద్వారా అందరికీ సమాచారం పంపిస్తున్నారు.
దాని విలువ ఎనిమిది కోట్ల రూపాయల నుంచి పది కోట్ల రూపాయల వరకు ఉంటుందని వారు వాట్సాప్ ద్వారా సందేశం పంపించారు. విజయవాడలోని ఓ వ్యక్తి దీనిని రూ.ఒకటిన్నర కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు.
ఆ శివలింగాన్ని కేదారేశ్వరపేటకు తీసుకు రావాలని పై ఐదుగురికి సదరు వ్యక్తి చెప్పాడు. విషయం తెలిసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు పురాతన విగ్రహాల పేరిట బిజినెస్ చేస్తుంటారని తేలింది.