యువతకు జగన్ సర్కార్ గుడ్న్యూస్: లక్షన్నర మందికి పైగా బెనిఫిట్: మైక్రోసాఫ్ట్తో
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ ప్రభుత్వం.. యువతకు శుభవార్త వినిపించింది. అర్హులైన లక్షా 60 వేల మందికి పైగా యువతకు సాఫ్ట్వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇప్పించడానికి మైక్రోసాఫ్ట్తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఒప్పందం కుదిరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల లక్షా 60 వేల మంది అర్హులైన యువతకు లబ్ది కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ వెల్లడించారు.
ఉగాది సందర్భంగా నిరుద్యోగ యువతకు వైఎస్ జగన్ ఇచ్చిన అపూర్వ కానుకగా ఆయన అభివర్ణించారు. నిరుద్యోగ యువతకు సాఫ్ట్వేర్, ఇతర ఐటీ ఆధారిత రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకు రావడం ఇదే మొదటిసారి అని హరికృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షా అరవై వేల మంది యువతకు వారికి ఇష్టమైన సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్పై మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇస్తుందని తెలిపారు. శిక్షణాకాలం ముగిసిన తరువాత వారికి సర్టిఫికెట్స్ ఇస్తుందని చెప్పారు. వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఈ శిక్షణ, సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయని అన్నారు.
యువతకు ఉపాధి కల్పన అవకాశాలను మెరుగుపర్చాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఉపాధిని కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందనడానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే గ్రామ/వార్డు వలంటీర్ల వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి జగన్ సర్కార్ ఉపాధిని కల్పించిందని గుర్తు చేశారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా అదే స్థాయిలో గ్రామీణ నిరుద్యోగ యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి దూరదృష్టికి, పనితీరుకు వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ అద్దం పడుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షా అరవై వేల మంది యువతకు ట్రైనింగ్ తో పాటు సర్టిఫికెట్స్ ఇచ్చి , ఉద్యోగావకాశాలు మెరుగుపరచడానికి మైక్రోసాఫ్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య నేడు MOU జరిగింది. ఇది యువతకు జగనన్న ఇచ్చిన ఉగాది కానుక.#YSJaganMarkGovernance pic.twitter.com/eyMzsVgQS8
— Dr Hari Krishna (@HariKrishnaCMO) April 13, 2021