ఓవైపు ప్రశంసలు- మరోవైపు సస్పెన్షన్లు- జగన్ ఉద్దేశమేంటి ?
ఏపీలో కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యులకు తగిన స్ధాయిలో వ్యక్తిగత రక్షణ కిట్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మొదట్లో సహనంగా ఉన్న డాక్టర్లు, అధికారులు ఒక్కొక్కరిగా తమ స్వరం పెంచుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ డాక్టర్లు, ఇతర సిబ్బంది సేవలను ప్రశంసించడంపై చర్చ సాగుతోంది.

కరోనా వైద్యులకు రక్షణేదీ ?
ఏపీలో కరోనాపై పోరాడుతున్న వైద్యులు, సహాయక సిబ్బందికి తగినంత స్ధాయిలో మాస్కులు కానీ, వ్యక్తిగత రక్షణ కిట్లు కానీ అందుబాటులో లేవు. మూడు వారాల క్రితం కరోనాపై పోరాటం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. వెనువెంటనే కిట్లను సమకూర్చుకోలేకపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల డాక్టర్లు, సహాయక సిబ్బందితో పాటు అధికారులు కూడా చేతులెత్తేస్తున్న పరిస్ధితి. ఇదే విషయాన్ని తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ బయటపెట్టగా... ఆ తర్వాత నగరి మున్సిపల్ కమిషనర్ కూడా దాదాపు ఇవే ఆరోపణలు చేశారు.

ప్రశ్నించిన ఇద్దరూ సస్పెన్షన్...
కరోనా మహమ్మారిపై పోరాడుతున్న వైద్యులకు రక్షణ కిట్లు, మాస్కుల సరఫరాలో తీవ్ర కొరత నెలకొందన్న విషయాన్ని నర్సీపట్నం డాక్టర్ గానీ, నగరి మున్సిపల్ కమిషనర్ గానీ బయటపెట్టారు. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభుత్వం బహిరంగ విమర్శలు చేశారన్న పేరుతో వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వీరు ప్రస్తావించిన సమస్యలు వాస్తవమా కాని అని ఆలోచించలేదు. దీంతో ప్రశ్నించిన వారినల్లా సస్పెండ్ చేస్తూ పోతారా అంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
Recommended Video
రంగంలోకి జగన్- వైద్యులపై ప్రశంసలు..
ఒకే సమస్యపై వరుసగా గళం వినిపించిన ఓ డాక్టర్, మరో మున్సిపల్ కమిషనర్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన అంశంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ఇవాళ తన క్యాంపు కార్యాలయం నుంచే కరోనా చికిత్స అందిస్తున్న డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జగన్.. వారి సేవలను ప్రశంసించారు. కరోనాపై పోరులో వీరు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. దీంతో డాక్టర్లు కూడా సీఎం ప్రశంసలతో ఉబ్బితబ్బిబయ్యారు.

పరిస్ధితి చేయిదాటుతుందనే..
ఏపీలో కరోనా వైరస్ రోగులను పరీక్షిస్తున్న వైద్యులకు తగినంత స్ధాయిలో మాస్కులు కానీ, ఇతర రక్షణ కిట్లు కానీ అందుబాటులో లేవన్న విషయం ప్రభుత్వానికి ముందే తెలుసు. అయినా దీనిపై వైద్యులు, అధికారులు బహిరంగ విమర్శలు చేసే వరకూ స్పందించలేదు. దీనికి తోడు క్షేత్రస్ధాయిలో వేధింపులు ఎక్కువయ్యాయి. రక్షణ కిట్లు లేకపోయినా డ్యూటీలు చేయాల్సిందేనంటూ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో డాక్టర్లు విధులు బహిష్కరించేందుకు సైతం సిద్ధమయ్యారు. దీంతో నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అదే జరగకపోతే.. రేపటి కల్లా పలుచోట్ల డాక్టర్లు నిరసనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications