ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంకోర్టుకు టీడీపీ, జనసేన
ఏపీలో త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. వైసీపీ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ, జనసేన న్యాయపోరాటానికి సిద్దమయ్యాయి. బీసీ రిజర్వేషన్ల కుదింపుపై త్వరలో సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయనున్నట్లు ఇరు పార్టీల నేతలు ఇవాళ ప్రకటించారు. దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా తన వాదనను సిద్దం చేసుకుంటోంది. ఎన్నికల నిర్వహణ ఆలస్యమైతే 14వ ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకురానుంది.

స్ధానిక సంస్ధల్లో బీసీ రిజర్వేషన్ల కోతపై విపక్షాల ఆగ్రహం
ఏపీలోని స్ధానిక సంస్ధలకు ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రంలోని స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రేపోమాపో దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఈ ఎన్నికల కోసం గతంలో పెంచిన రిజర్వేషన్లను తిరిగి 50 శాతానికి పరిమితం చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 34 శాతం బీసీ రిజర్వేషన్లను తిరిగి 24.15కు పరిమితం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకు రానుంది. అయితే బీసీ కోటాను తగ్గిస్తూ వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది

బీసీ రిజర్వేషన్ల కోతపై సుప్రీంకోర్టుకు టీడీపీ, జనసేన
బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 9.85 శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబడుతున్న విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఇవాళ ప్రకటించాయి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి బీసీల మద్దతు లభించడంతో అధికారం దక్కించుకున్న వైసీపీ బలహీన వర్గాల రిజర్వేషన్లలో కోత విధించడం వారిని మోసం చేయడమేనంటూ ఇరు పార్టీలు గళమెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్ధితి. కాబట్టి వైసీని మరింత ఇరుకునపెట్టేందుకు బీసీ రిజర్వేషన్ల కోతపై సుప్రీంకోర్టులో విడివిడిగా పిటిషన్లు వేస్తామని టీడీపీ, జనసేన నేతలు చెబుతున్నారు.

న్యాయపోరాటంతో ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయా ?
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోతపై టీడీపీ, జనసేన సుప్రీంకోర్టును కనుక ఆశ్రయిస్తే ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ప్రస్తుతం తాజా పరిస్దితి బట్టి చూస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 5 లేదా 6 తేదీల్లో స్ధానిక సంస్ధల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతోంంది. అంతకంటే ముందే బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అంటే బుధవారం ఇరు పార్టీలు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసే అవకాశముంది. అదే జరిగితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

బీసీ రిజర్వేషన్లపై వైసీపీ వ్యూహమేంటి ?
స్ధానిక సంస్ధల్లో బీసీ రిజర్వేషన్ల కోతపై విపక్ష టీడీపీ, జనసేన సుప్రీంకోర్టును కనుక ఆశ్రయిస్తే ప్రభుత్వం గట్టిగా పోరాడాల్సిన పరిస్ధితి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు గతంలో రిజర్వేషన్లపై ఇచ్చిన 50 శాతం కోటా పరిమితి ఉత్తర్వులను ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. ప్రస్తుతం హైకోర్టు తీర్పు కూడా గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే ఇచ్చింది. కాబట్టి ఇదే అంశాన్ని వైసీపీ సర్కారు సుప్రీంకోర్టు ముందుకు తీసుకొస్తుంది. అప్పుడు తమకు సానుకూల ఫలితం వస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమాగా ఉన్నాయి
బీసీ రిజర్వేషన్లలో కోత వ్యవహారాన్ని విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందకముందే తాము సుప్రీంకోర్టులో దీనికి సరైన కౌంటర్ ఇవ్వాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో పాటు ఈ నెల 31లోగా ఎన్నికలు నిర్వహించకపోతే రూ.3400 కోట్ల 14వ ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయనే అంశాన్ని కూడా ప్రభుత్వం తన వాదనలో పేర్కొ నే అవకాశముంది.












Click it and Unblock the Notifications