హైదరాబాద్ పనికి వచ్చింది, సింగపూర్ను మించిన రాజధాని: చంద్రబాబు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విశాలమైన రోడ్లు, భూగర్భ జల వ్యవస్థ, మురుగనీటి పారుదల వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లన్నింటిని ఒక్కటొక్కటిగా చేస్తూ వస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకరోజు సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు హిందూస్తాన్ టైమ్స్ - మింట్ ఆసియా లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్నారు.
చంద్రబాబు వెంటే మేం, టీడీపీ కోసం నేను-జూ.ఎన్టీఆర్ సిద్ధం: కళ్యాణ్ రామ్
ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెన్సీలను నియమించుకొని రాజధాని ప్రణాళికలు, డిజైన్లను రూపొందించుకున్నట్లు తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా సింగపూర్ను పరిశీలిస్తున్నానని, వారు వేగంగా ముందుకు అడుగు వేశారని చంద్రబాబు అన్నారు. ఏపీ కొత్తగా ఏర్పడి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రమని చెప్పారు.
హైదరాబాద్ అనుభవం పనికి వచ్చింది
రాజధాని లేకపోవడం అన్నింటి కంటే పెద్ద మైనస్ అని చంద్రబాబు అన్నారు. హైదరాబాదులో సైబరాబాద్ వంటి కొత్త నగరాన్ని నిర్మించిన అనుభవం తనకు ఉందని ఈ సందర్భంగా చెప్పారు. బ్రౌన్ ఫీల్డ్ సిటీగా హైదరాబాదును తీర్చిదిద్దానని, అదే అనుభవం తనకు ఇక్కడ అక్కరకు వచ్చిందని చెప్పారు.
అదే అతిపెద్ద సవాల్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం చక్కటి ఎకో సిస్టంను ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. కొత్త రాజధానికి అవసరమైన భూమిని సమకూర్చుకోవడం అతిపెద్ద సవాల్గా మారిందని చెప్పారు. 33 వేల ఎకరాల ప్రభుత్వం భూమి అందుబాటులో లేకపోవడంతో దీని కోసం రైతుల నుంచి భూసేకరణ చేశామని చెప్పారు.
నేను పిలుపునిస్తే
అంతేకాదు, కొత్త రాజధాని కోసం ఇతరుల నుంచి భూమి తీసుకోవడానికి కావాల్సినంత డబ్బు కూడా లేదని చంద్రబాబు చెప్పారు. దీంతో అన్నీ ఆలోచించి తాను రైతులకు పిలుపునిస్తే సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైతులు తనపై నమ్మకంతో 33వేల ఎకరాల భూమిని ఇచ్చారన్నారు.
సింగపూర్ను మించిన రాజధాని
సింగపూర్ నగరాన్ని మించిన రాజధానిని నిర్మిస్తానని తాను చెప్పానని, తనపై నమ్మకంతో రైతులు ఆ భూమి ఇచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణం మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ప్రభుత్వాన్ని అడిగామని, వారు స్పందించరని, ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఇచ్చారన్నారు. అమరావతిని సింగపూర్ కంటే పెద్దగా, అత్యున్నతంగా నిర్మిస్తామన్నారు.
కొత్త రాష్ట్రం గురించి ఆరా
కొత్త రాష్ట్రం ఎలా ఉందని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్కరోజు సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టోనీ బ్లెయిర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతంలో తాను హైదరాబాదును సందర్శించిన అంశాన్ని, ఏపీలో చంద్రబాబుతో కలిసి మహబూబ్ నగర్లోని ఓ గ్రామాన్ని సందర్శించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారని తెలుస్తోంది. కొత్త రాష్ట్రం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్న తీరు తనకు తెలుసునని చెప్పారు. రాజధాని కోసం రైతులు భూమి ఇచ్చిన అంశంపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిపై ఎలా దృష్టి పెట్టామో చంద్రబాబు వివరించారు.