చండీగఢ్: అధ్యయనం చేసిన మంత్రి బృందం (ఫోటో)
హైదరాబాద్: భారత్లోనే అత్యంత ప్రణాళికవంతమైన రాజధాని నగరంగా పేరొందిన చండీఘడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కమిటీ ఛైర్మన్, మున్సిపల్ శాఖ మంత్రి డా. పి నారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం పర్యటించింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న చండీఘడ్, పంజాబ్ - హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. బృందాన్ని స్వాగతించిన చండీఘడ్ - హర్యానా విధాన సభలు, సచివాలయం, వివిధ వాణిజ్య అధికార కార్యాలయాలకు తీసుకువెళ్లి వాటి నిర్మాణ ప్రాధాన్యతలను వివరించారు.
చండీఘడ్ నగరంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన రవాణా వ్యవస్ద, రహదారుల నిర్మాణం, జంక్షన్లు, పార్కులు తదితర వాటి నిర్మాణంలో పాటించిన ప్రణాళికలు, నాణ్యతా ప్రమాణాలను బృందం పరిశీలించింది. నగరంలో మానవ నిర్మితమైన అత్యంత సుందరమైన నుక్నా కొలనును బృందం సందర్సించింది. నగరంలో ప్రతిరోజూ సుమారు 300 మెట్రిక్ టన్నుల వ్యర్ద పదార్దాలను సేకరిస్తుండగా వాటి నుంచి సుమారు 100 మెట్రిక్ టన్నుల ఇంధన బ్లాక్లను తయారుచేసి ఫర్నేస్ లు, పరిశ్రమల బాయిలర్లకు ఇంధన వనరుగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యావరణ సమతుల్యత, ప్రకృతి పరిరక్షణ విషయాల్లో ఎంతో ప్రాధాన్యత యంత్రాంగ్ చూపుతున్న విషయాన్ని బృందం గమనించింది. నగరంలో సౌర విద్యుత్ వినియోగంతో పాటు ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసి పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు చర్యలు తీసుకొంటున్నామని, దీనివల్లనే ఈ నగరానికి గ్రీన్ సిటీగా పేరొచ్చిందని అధికారులు తెలిపారు.
శివాలిక్ పర్వత ప్రాంతానికి సమీపంలో నిర్మాణమైన చంఢీఘడ్ నగరం 114 చదరపు కి.మీ వైశాల్యంతో 22 గ్రామాలను అనుసంధానం చేసుకొంటూ 1950దశకంలో నిర్మాణమైంది. 1966లో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిమైన ఈ నగరంలో అత్యంత ప్రణాళికాయుతంగా త్రాగునీరు, డ్రైనేజీ, వరదనీరు, వ్యర్ద పదార్దాల నిర్వహణకు ఏర్పాట్లు ఉన్నాయి. నగర శివారులో కిషన్ గడ్ ప్రాంతంలో ఏర్పాటైన ఐటీ పార్కులో అంతర్జాతీయ ప్రణాలతో కూడిన సదుపాయలు కల్పించారు.
బృందాన్ని స్వాగతించిన వారిలో పంజాబ్ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి వేణు ప్రసాద్, చంఢీఘడ్ ఛీప్ సిటీ ప్లానర్ సుమిత్, పంజాబ్ రాష్ట్ర ఛీప్ సిటీ ప్లానర్ ధిల్లాన్ తదితరులు ఉన్నారు. మంత్రి నారాయణ బృందంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని సలహా కమిటి సభ్యులు, మాజీ ఎమ్మేల్యే బీద మస్తాన్ రావు, మున్సిపల్ శాఖ కమీషనర్ వాణీమోహన్, ప్రజా ఆరోగ్య విభాగం ఇంజనీర్ ఇన్ ఛీప్ డా. పి పాండు రంగారావు, డిటిసిసి డైరెక్టర్ తిమ్మారెడ్డి ఉన్నారు.