ఆంధ్రప్రదేశ్ అప్పులు.. రుషికొండ ప్యాలెస్.. కళ్ళు తిరిగాయన్న సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే ఎక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించి లెక్కలను అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు మొత్తం తొమ్మిది లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
ఏపీ అప్పుల చిట్టా విప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అప్పులు వివరించిన చంద్రబాబు గవర్నమెంట్ అప్పు రూ.4,38,278 కోట్లు ఉందని పేర్కొన్నారు. ఇక పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు ఉందని, కార్పొరేషన్ అప్పు రెండు లక్షల 48 వేల 677 కోట్ల రూపాయలు ఉందని, సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు 36 వేల కోట్ల రూపాయలు ఉందని పేర్కొన్నారు.

ఏపీ మొత్తం అప్పు 9 లక్షల 74వేల కోట్లపైన
పవర్ సెక్టార్ లో 34,267 కోట్ల రూపాయల అప్పు ఉందని, ఇక అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అన్ని స్కీమ్స్ మీద 1,13,244 కోట్ల రూపాయల అప్పు ఉందని పేర్కొన్నారు. ఎంప్లాయిస్ అవుట్ స్టాండింగ్ డ్యూస్ 21,980 కోట్ల రూపాయలు ఉండగా, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ 1,191 కోట్ల రూపాయలు ఉందని, మొత్తంగా ఏపీ అప్పు 9,74,556 కోట్ల రూపాయలు ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఆర్ధిక ఉగ్రవాదం
గత ప్రభుత్వ హయాంలో ఏపీలో ఆర్థిక ఉగ్రవాదం రాజ్యమేలిందని ఆయన ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓట్లేస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేసారని, సంపాదన సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని చంద్రబాబు విమర్శించారు. అప్పులకు సంబంధించిన లెక్కలు చిట్టా చెప్పిన ఆయన రుషికొండ ప్యాలెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రుషికొండ ప్యాలెస్ చూస్తే నాకే కళ్ళు తిరిగాయి
431 కోట్ల రూపాయలతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారని, రుషికొండ ప్యాలెస్ ను చూస్తే తనకే కళ్ళు తిరుగుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఇంత పెద్ద ప్యాలెస్ కడతారా అంటూ ప్రశ్నించారు. 700 కోట్ల రూపాయలతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారని, ఒక పత్రికకు 400 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు.
కొత్త ఆలోచనలతో సంపాదన సృష్టించి పేదలకు పంచుతాం
మద్యం పైన కూడా అవినీతి చేశారని 25 వేల కోట్లు అప్పు తెచ్చారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చేసరికి ఏపీ వెంటిలేటర్ పై ఉందని పేర్కొన్న చంద్రబాబు తమ దగ్గర డబ్బులు లేవని నూతన ఆలోచనలు మాత్రమే ఉన్నాయన్నారు. కొత్త ఆలోచనలతో సంపాదన సృష్టించి పేదలకు పంచుదామని చంద్రబాబు స్పష్టం చేశారు. సంవత్సరానికి 33 వేల కోట్ల రూపాయల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications