షాకింగ్:రాజధాని నిర్మాణానికి ప్రజలు అప్పులివ్వాలా?...అలోచించే అడిగారా బాబూ?
అమరావతి:ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అప్పు ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. డబ్బులున్న వారు దాన్ని బ్యాంకుల్లో దాచుకోకుండా ప్రభుత్వానికి అప్పిస్తే అందుకు ప్రతిగా వారికి బాండ్లు జారీ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల జరిగిన అఖిలపక్షాల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బుధవారం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాజధాని కోసం అప్పులకు ప్రతిగా ఇచ్చే బాండ్లను తీసుకున్న వారికి బ్యాంకులు ఇస్తున్నదానికంటే రెండు లేదా మూడు శాతం వడ్డీ అదనంగా చెల్లిస్తామన్నారు. దీనిపై త్వరలోనే విధివిధానాలు సిద్ధం చేస్తామని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు...ఇంకా ఏం చెప్పారంటే?
"ప్రవాసాంధ్రులు, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకునే ప్రతి ఒక్కరూ ఇలా అప్పులిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించాలి. సమీకరణ పద్ధతిలో రైతులు భూములిచ్చిన తరహాలోనే...రాజధాని నిర్మాణానికి అప్పులివ్వాలి. ఎవరికి తోచిన విధంగా వారు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి. విభజన చట్టం, హామీల అమలు కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 6వ తేదీ వరకూ నల్లబ్యాడ్జీలు ధరించాలి. ఉద్యోగులు అదనపు గంటలు పనిచేసి వినూత్న రీతిలో నిరసన తెలపాలి. విద్యార్థులు చదువుకుంటూనే రోజుకో గంట రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. త్వరలో దిల్లీ వెళ్లి...ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తాను...ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేందుకు సహకరించాలని వారిని కోరుతాను. రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు కేంద్రంపై పోరాడాలి"అని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ ప్రకటనతో...ఖంగుతిన్న జనాలు...
ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా ప్రకటనతో జనాలు ఖంగు తిన్నారు. కారణం తాము ఏ ఆశ అయితే చంద్రబాబు మీద పెట్టుకున్నారో ఆ చివరి ఆశను కూడా ఈ ప్రకటనతో ఆయన వమ్ము చేసేశారు. ఎన్ని జరుగుతున్నాఇప్పటిదాకా చంద్రబాబు ఏదో ఒకటి చేస్తారని ఆయన మీద ఎంతో కొంత నమ్మకం ఉన్నప్రజలకు ఈ తాజా ప్రకటనతో ఆయన కాడి కింద పడేసినట్లు సంకేతాలు అంది నివ్వెరపోయారు. అంతేకాదు చంద్రబాబు తమకి కూడా నమ్మక ద్రోహం చేసినట్లు ఫీలవుతున్నారు. అనుభవజ్ఞుడని...పెద్దవాడని...కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలాగైనా తన సీనియారిటీతో ఒడ్డున పడేస్తాడని భావించి ఒటేస్తే...ఒక్కొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ వస్తున్న ఆయన చివరకు అతి ముఖ్యమైన రాజధాని నిర్మాణం విషయంలోనూ అంత తేలిగ్గా చేతులెత్తాయడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు.
అవన్నీ నిజాలు కావా?...ఇప్పుడెలా?...
రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయంటూ లక్షల లక్షల కోట్ల గురించి అనుకూల పత్రికల్లో మీడియాలో ఊదరగొట్టి తీరా అసలు సమయం వచ్చేసరికి ఇలా కనీసం కూడా చేయకుండా చేతులెత్తేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ పెట్టుబడుల ప్రకటనలన్నీ వాస్తవం కాదని సిఎం తాజా ప్రకటనతో స్పష్టమైపోయి పరిస్థితి. అంతేకాదు...రాజధాని నిర్మాణానికి బ్యాంకులు అప్పులు ఇచ్చేశాయి...కేంద్రం తానిచ్చే నిధులు ఇచ్చేసింది...ఆర్ధిక సంస్ధల నుండి అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలూ అయిపోయాయి. అందుకే రాజధాని నిర్మాణానికి జనాలే అప్పు ఇవ్వాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు.
అవన్నీ ఏమయ్యాయి...మరి ఆ భూములు...
నా అమరావతి...నా ఇటుక పేరుతో నిధుల సేకరణ జరిగింది...అలాగే సచివాలయంలోనూ హుండీలు పెట్టారు...అప్పట్లో ప్రజలు బాగానే విరాళాలు ఇచ్చినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. తెలంగాణ ఒడిబియ్యం సత్యవాణి నిలువు దోపిడీ కూడా ఇచ్చింది...మరి ఆ విరాళాలు ఏమయ్యాయో దేనికి ఖర్చు చేశారో? కనీసం మొహమాటానికైనా వివరణ లేదు...అసలు అలా లెక్క చెప్పాలన్న ఆలోచనే లేదు. ఏవేవో స్కీములు చెప్పి సింగపూర్ కంపెనీలకు వందల ఎకరాలను కట్టబెట్టి రాజధాని నిర్మాణంలో కొత్త పుంతలు తొక్కుతున్నట్లు చెప్పుకొని చివరకు ఇదా ప్రకటన అని ప్రజలు విస్మయం చెందుతున్నారు.
ఇప్పుడు...ఆ రాజధాని రైతుల పరిస్థితేంటి?....
ప్రజలు అప్పులు ఇస్తేనే రాజధాని కట్టడం సాధ్యమతుందన్న తరహాలో ఉన్న ముఖ్యమంత్రి ప్రకటన రాష్ట్ర ప్రజలందరినీ...ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను నిస్తేజానికి గురిచేసింది. తాము నవ్యాంధ్ర రాజధాని కోసం ఇచ్చిన భూములకు మంచి వాణిజ్య విలువ వస్తుంది, తమ భవిష్యత్తు తరాలు బాగుపడతాయని భావించి భూములు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు ఇచ్చిన రైతుల్లో ఇప్పుడు భయాందోళనలు రేకెత్తుతున్నాయి. గడచిన నాలుగేళ్లు కేంద్రంలో టీడీపీ మిత్ర పక్షం, భాగస్వామ్య పార్టీ ఉన్నా నిధులు రాకపోతే, రాబట్టుకోలేకపోతే ఒకవేళ చంద్రబాబే మళ్లీ గెలిచినా రాబోయే ప్రతికూల పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఇంకెలా సాగుతుంది...
ఆ వాదన మర్చిపోయారా?...ప్రజలకు ఆ డౌటు ఉండదా?..
రాష్ట్రాలకు ఇచ్చిన నిధులపై కేంద్రానికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్న వాదన పలు సందర్భాల్లో బహిరంగంగానే బలంగా వినిపించిన మీకు ఇప్పుడు ఆ వాదన గుర్తుకు రాలేదా?...కేంద్ర ప్రభుత్వానికే లెక్కలు చెప్పకుంటే తామెంత?...రేపు ఒకవేళ వేరే ప్రభుత్వం వస్తే ఈ రాజధాని నిర్మాణానికి తామిచ్చిన డబ్బుకు ప్రతిగా ఇచ్చిన బాండ్లను అది పరిగణనలోకి తీసుకోకపోతే ఏం చెయ్యాలి...పైగా ఎపిలోని రాజకీయ పార్టీల వ్యవహారం చూస్తే ఏ మాత్రం నైతికత, విశ్వసనీయత, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు పట్టించుకునే ధోరణి కనిపించడం లేదు...కాబట్టి ఏ తమ డబ్బుకు కనీస భద్రత లేని పరిస్థితుల్లో...అందులోనూ ఒకసారి దెబ్బతిన్న పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించడం దుర్లభమేనని తెలుస్తోంది.
పర్యవసానాలు...ఆలోచించే ప్రకటించారా?...
ఈ ప్రకటన చేసే ముందు చంద్రబాబు అన్ని కోణాల్లో ఆలోచించారా?...ఎందుకంటే చంద్రబాబు అనుభవం తెలివితేటలు మీద తాము ఎంతో నమ్మకం పెట్టుకొని అధికారం అప్పగిస్తే...ఆయన ఏమీ చెయ్యకపోగా తిరిగి మళ్లీ మనల్నే నిధులు అడుగుతున్నారంటే...ఇంక తాము ఆయనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము అయినట్లే ప్రజలు భావించరా?...అలాగే మీరు నిధులివ్వకున్నా పర్లేదు నేను నా ప్రజల నుంచి నిధులు సేకరించి రాజధాని కట్టగలను అని కేంద్రాన్ని అంటూ ఇలా నిధుల సేకరణకు ప్రయత్నించడం ఎవరికి నష్టం?...వాళ్ల మీద ఆ ఒత్తిడిని కూడా తొలగించేసి వచ్చే నిధుల క్కూడా మంగళం పాడుకుంటున్నామనే సంగతి ఆలోచించారా? అలాగే కేంద్రంలో ఒకవేళ మోడీ కాకుండా వేరే ప్రభుత్వం వచ్చినా వారు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా ఉంటారని భావించలేం...కాబట్టి వాళ్లు కూడా మోడీ తీరులోనే స్పందిస్తే ఏమవుతుంది...లేదంటే ఇది కూడా ప్రజా స్పందనను బట్టి నిర్ణయం తీసుకుందామనుకొని జస్ట్ ఊరికే ఒక ట్రయల్ వేశారా?...ఈ ప్రశ్నలకు మరికొన్ని రోజుల్లో సమాధానం లభిస్తుంది...అంతవరకు వేచిచూడటమే!