విద్యార్థినుల కోసం: ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్స్..ప్రత్యేక వెండింగ్ మిషన్లు
అమరావతి: విద్యార్థినుల్లో పాఠశాల దశ నుంచే ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా..ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకుని వస్తోంది.. దశలవారీగా. ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ఈ యాంత్రాలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. క్రమంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాటిని అమర్చనుంది.
హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ సహకారంతో..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) లైఫ్కేర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం ఇదివరకే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. దీనికి అనుగుణంగా తొలిదశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో వాటిని అమర్చారు.
ఒక రూపాయికే..
శానిటరీ నాప్కిన్స్.. ఒక రూపాయికే లభించేలా ఏర్పాటు చేసింది. ఒక రూపాయి నాణేన్ని ఈ మిషన్లో వేస్తే.. నాప్కిన్స్ అందులో నుంచి బయటికి వస్తాయి. నిజానికి - కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనఔషధి దుకాణాల ద్వారా ఈ నాప్కిన్స్ 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాటి ధరను తగ్గించింది. గ్రామస్థాయిలో జనఔషధి దుకాణాలు అందుబాటులో లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్లను ప్రాథమికన్నత పాఠశాలల్లో అమర్చనుంది.
విద్యాసంవత్సరం ఆరంభం నాటికి..
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం అయ్యే నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో వాటిని అందుబాటులోకి తీసుకుని రావడానికి విద్యా మంత్రిత్వశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ లైఫ్కేర్ నుంచి అవసరమైన యంత్రాలను తెప్పించుకోనుంది. విద్యా సంవత్సరం తొలి ఆరు నెలల వ్యవధిలోనే అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.
అనారోగ్యం బారి నుంచి తప్పించడానికి..
గ్రామీణ ప్రాంతాల్లో యుక్త వయస్సు వచ్చిన విద్యార్థినులకు నెలసరి రోజుల్లో ఆరోగ్య పరిరక్షణపై సమగ్ర అవగాహన కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. బహిరంగ మార్కెట్లో శానిటరీ నాప్కిన్స్, ప్యాడ్స్ రేట్లు అధికంగా ఉంటున్నాయి. అంత మొత్తాన్ని ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు చెందిన విద్యార్థినుల సౌకర్యం కోసం ప్రభుత్వం వాటిని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఒక రూపాయికే శానిటరీ నాప్కిన్స్ను అందుబాటులోకి తీసుకుని వస్తోంది.