ఒత్తిడి లేదు, రాజధానిపై అనుమానాలొద్దు: నారాయణ
హైదరాబాద్: రాజధానిని ఉత్తరాంధ్రలో పెడితే రాయలసీమవాసులకు, రాయలసీమలో పెడితే ఉత్తరాంధ్రవాసులకు ఇబ్బంది తప్పదని, రాజధాని ఏర్పాటుకు సమదూరం, సమ న్యాయమే ప్రమాణాలు అని, అనంతపురం నుంచి గుంటూరు 560 కిలో మీటర్లు, శ్రీకాకుళం నుంచి 640 కిలోమీటర్లు ఉంటుందని, అందుకే ఆ పరిసరాల్లోనే రాజధాని ఉంటుందని తాము చెబుతున్నామని, అంతేకానీ, తాము ఇంక నిర్ణయించలేదని మంత్రి నారాయణ చెప్పారు.
రాజధాని ఎంపిక వ్యవహారం మొత్తం శాస్త్రీయంగా జరుగుతోందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు, ఆరోపణలకు తావులేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుతో కలిసి గురువారం ఆయన శివరామకృష్ణన్ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కమిటీ ముఖ్యమంత్రితో సమావేశం అయినప్పుడు చెప్పిన కొన్ని అంశాల ఆధారంగా కొంతసమాచారం అడిగారన్నారు.
అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూమి వివరాలను కమిటీకి సమర్పించామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పరిశ్రమల ఏర్పాటు, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ఒక సామాజిక వర్గం ఒత్తిడి మేరకే గుంటూరు - విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు.
కాగా, రాష్ట్రానికి కేంద్ర బిందువైన మధ్య ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలక సంస్థలను ఏర్పాటు చేయడానికి తాము అంగీకారం తెలిపామని శివరామకృష్ణన్ తెలిపారు. రాబోయే పది రోజుల్లో ముసాయిదా అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, వాటిపై ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. రాజధానిపై తాను పుకార్లను ప్రచారం చేయబోనని చెప్పారు.