అసెంబ్లీ ముందుకు నిమ్మగడ్డ- త్వరలో ప్రివిలేజ్ కమిటీ సమన్లు ? రామోజీరావు కేసే ఆధారం
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కూ, వైసీపీ సర్కారుకు మధ్య సాగుతున్న పోరు మరో మలుపు తీసుకోబోతోంది. మంత్రులపై గవర్నర్కు చేసిన ఫిర్యాదులో నిమ్మగడ్డ అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో విచారణ చేయిస్తున్న సర్కారు.. ఇప్పుడు ఏకంగా ఆయన్ను అసెంబ్లీ ముందు హాజరయ్యేలా వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ న్యాయసలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ అసెంబ్లీ ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేయనుంది.
నిమ్మగడ్డ విశేషాధికారాలు ప్రయోగిస్తారా ? ఎన్నికల రద్దు వార్నింగ్ వెనుక- మళ్లీ టార్గెట్ వైసీపీ ?
పరాకాష్టకు జగన్, నిమ్మగడ్డ పోరు
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా సాగుతున్న జగన్ సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పోరు పతాకస్ధాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికలకు సహకరించని ప్రభుత్వంపై నిమ్మగడ్డ హైకోర్టులో ధిక్కార పిటిషన్ వేసి పోరు సాగిస్తుండగా.. ఆయనకు కౌంటర్ ఇచ్చేందుకు అసెంబ్లీని ప్రభుత్వం వేదికగా చేసుకోబోతోంది. దీంతో త్వరలో రాష్ట్రంలో పలు ఆశ్చర్యకరమైన పరిణామాలు నెలకొనే పరిస్దితి కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నిమ్మగడ్డ రమేష్పై విచారణ ప్రారంభించిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ త్వరలో మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు పరాకాష్టకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిమ్మగడ్డకు త్వరలో అసెంబ్లీ సమన్లు ?
ఇద్దరు మంత్రులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ఇప్పటికే ఓమారు సమావేశమై చర్చించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇంకా నోటీసులు మాత్రం జారీ చేయలేదు. తొందరపడి నోటీసులు జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉండటంతో ప్రస్తుతం న్యాయ సలహా తీసుకుంటోంది. అనంతరం నిమ్మగడ్డకు అసెంబ్లీకి విచారణకు రావాలని సమన్లు జారీ చేసే అవకాశముంది. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ అడుగులు వేస్తున్నట్లు అర్దమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎస్ఈసీకి జైలుశిక్ష ఉదంతాన్ని గుర్తుచేస్తూ కమిటీ ఛైర్మన్ కాకాణి వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో త్వరలో ఏమైనా జరగొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చేశారు.
గతంలో రామోజీరావుకు మండలి సమన్లు
గతంలో ఏపీ శాసనమండలిని ఉద్దేశించి ఈనాడు పత్రికలో పెద్దల సభలో గలాభా అంటూ హెడ్డింగ్ పెట్టి కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై మండలి ముందు హాజరుకావాలని ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత రామోజీరావుకు సమన్లు పంపారు. వాటిని ఆయన పట్టించుకోకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చినా శాసనమండలి మాత్రం వెనక్కి తగ్గలేదు. అప్పటి హైదరాబాద్ కమిషనర్ను రామోజీరావును అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారంలో ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వం కమిషనర్ అరెస్టు చేయకుండా అడ్డుకట్ట వేయగలిగింది. అప్పట్లో మండలి వ్యవహరించిన తరహాలోనే ఇప్పుడు అసెంబ్లీ నిమ్మగడ్డను తమ ముందు హాజరై క్షమాపణలు చెప్పాలని కోరుతుందా లేక ప్రివిలేజ్ కమిటీతో సరిపెడుతుందా అన్నది తేలాల్సి ఉంది.
నిమ్మగడ్డను జైలుకు పంపడం సాధ్యమేనా ?
మొన్నటి ప్రివిలేజ్ కమిటీ సమావేశం తర్వాత ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ మహారాష్ట్ర ఉదంతాన్ని గుర్తుచేస్తూ అక్కడి ప్రభుత్వం గతంలో ఎస్ఈసీని జైలుకు పంపిన విషయాన్ని గుర్తుచేశారు. అసెంబ్లీ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అన్నట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో అసెంబ్లీకి నిమ్మగడ్డను రప్పించేందుకు ప్రయత్నించి కుదరకపోతే జైలుకు పంపేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అసెంబ్లీకి కానీ స్పీకర్కు కానీ జైలు శిక్షలు విధించే అధికారం లేదని గతంలో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీంతో నిమ్మగడ్డకు జైలు శిక్ష కాకుండా మరే శిక్ష విధించేందుకు వైసీపీ సర్కారు ప్రివిలేజ్ కమిటీ ద్వారా ప్రయత్నిస్తుందన్న చర్చ జరుగుతోంది.
Recommended Video