ఏపీకి చేరిన మరో 4.8 లక్షల కోవీషీల్డ్ డోసులు... స్టోరేజీ యూనిట్కు తరలింపు...
ఆంధ్రప్రదేశ్కు శుక్రవారం(మే 14) 4.8లక్షల కోవీషీల్డ్ డోసులు చేరుకున్నాయి. వ్యాక్సిన్ల కొరతతో సతమతమవుతున్న రాష్ట్రానికి ఇది కాస్త ఊరటనిచ్చినట్లయింది. పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ నుంచి కోవీషీల్డ్ డోసులను నేరుగా గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. అక్కడినుంచి గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజీ యూనిట్కి చేర్చి భద్రపర్చనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు ఆయా జిల్లాలకు వీటిని సప్లై చేయనున్నారు.
వ్యాక్సిన్ల కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో సోమ,మంగళవారాల్లో వ్యాక్సినేషన్ జరగలేదు. తాజాగా వచ్చిన వ్యాక్సిన్లను రెండో డోసు వారికి ఇచ్చే యోచనలో వైద్యారోగ్య శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ల సమస్య లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలుస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి జూన్ 3 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో వ్యాక్సిన్ డోసుల కొనుగోలుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచింది.
మే 20 న సాయంత్రం 5 గంటలకు ప్రీ బిడ్ మీటింగ్ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు ఏపీఎంఎస్ఐడీసీ పేరిట ఈఎండీ కింద 3 లక్షల రూపాయల డీడీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే... గడిచిన 24 గంటల్లో 89,087 నమూనాలను పరీక్షించగా.. 22,018 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 13,88,803కి చేరింది. తూర్పు గోదావరి జిల్లాలో కొత్త కేసుల ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ కూడా అక్కడ గరిష్టంగా 3432కేసులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో 2708, అనంతపురం 2213, విశాఖపట్నం 2200 కొత్త కేసులు వచ్చాయి.
గడిచిన 24 గంటల్లో కొవిడ్ బారినపడి 96 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,173కు పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే, అనంతపురంలో 11 మంది, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలో 10 మంది చొప్పున, విజయనగరంలో 9 మంది, చిత్తూరు, కృష్ణలో 8 మంది చొప్పున, గుంటూరు, నెల్లూరులో ఏడుగురు చొప్పున, కర్నూలు, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పున, కడపలో నలుగురు మృత్యువాతపడ్డారు