ఏపీ టెట్ ఫలితాలు విడుదల: 58 శాతం అర్హత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07శాతం మంది అర్హత సాధించినట్లు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. టెట్ను ఆన్లైన్లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు.
మొత్తం మార్కులు 150 మార్కులకు జనరల్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్కు 4,07,329 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అధికారులు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 150 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
ముందుగా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్ 14నే విడుదల కావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యమైంది. కాగా, అభ్యర్థులు తమ మార్కుల వివరాలను ప్రభుత్వ వెబ్సైట్ http://cse.ap.gov.in/DSE/ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.