ఏపీలో సెంటిమెంట్ చిచ్చు రాజేసిన ముఖ్యమంత్రి జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సెంటిమెంట్ చిచ్చు రాజేశారని సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ రాజ్యసభకు ఎంపిక చేసిన సభ్యులద్వారా రాష్ట్రంలో మరోసారి ఏపీ, తెలంగాణ అనే సెంటిమెంట్ రాజుకుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, తన కేసులు వాదిస్తున్న లాయర్ నిరంజన్రెడ్డిని ఎంపిక చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఈ చిచ్చు రాజుకుంటోంది.

ఏపీలో బీసీలు లేరా?
ఆంధ్రప్రదేశ్లో బీసీలెవరు లేరా? తెలంగాణ నుంచి దిగుమతి చేసుకోవాలా? అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి ఎంపికను నిరసిస్తూ ఏపీ నిరుద్యోగ జేఏసీ నాయకులు విశాఖపట్నంలోని గురుద్వారా దగ్గర చిడతలు వాయించి నిరసన తెలియజేశారు. ఏపీ నుంచి రాజ్యసభలో అడుగుపెడుతోన్న వీరిద్దరు ఆంధ్ర నిరుద్యోగులకు తెలంగాణలో ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలరా? అని ప్రశ్నించారు. నిరంజన్రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు పదవులు ఇచ్చిన జగన్మోహన్రెడ్డి.. మా సంగతి చెప్పాలంటూ చిడతలు వాయించారు.

తెలంగాణవారికే కీలక పదవులు?
వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణకు చెందినవారికే కీలకమైన పదవులు కట్టబెడుతున్నారంటూ సమైక్యాంధ్ర ఉద్యమం చేసిన జేఏసీ నాయకులు ఆరోపించారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి సలహాదారులుగానే కాకుండా వివిధ విభాగాల్లో గౌరవహోదాలో కూడా పదవులు అధిష్టించినవారంతా తెలంగాణవారేనని, ఆ పదవులకు ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్లో తగినవారు ఎవరూ లేరా అని నిలదీస్తున్నారు.

కాంగ్రెస్ గతే బీజేపీకి
అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రవారికే పదవులివ్వాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఉమ్మడి రాష్ట్రాన్ని చీల్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో అందరూ చూస్తున్నారని, అంతకంటే ఎక్కువగా నమ్మకద్రోహం చేస్తున్న బీజేపీకి కూడా అదే గతి పడుతుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పదవులు ఆంధ్రావారికేనంటూ నినాదాలు చేశారు. మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా ఇలా నిరసన ప్రదర్శనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని సీనియర్ రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications