ఆండ్రూ మినరల్స్ లో లెక్కలు లేని లేటరైట్, బాక్సైట్ తవ్వకాల అనుమానం ; సమగ్ర దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలు కొనసాగుతున్నాయని గత కొంతకాలంగా పెద్దఎత్తున ఆందోళనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆండ్రూ మినరల్స్ కు సంబంధించిన లేటరైట్ లీజులలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విజిలెన్స్ బృందాల ప్రాథమిక విచారణలో తేలిందని గనుల శాఖ వెల్లడించింది. ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని వెల్లడించిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వీజీ వెంకట్ రెడ్డి లెక్కలు లేని ఖనిజాన్ని కూడా గుర్తించామని వెల్లడించారు.
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఎన్జీటీ విచారణ కమిటీ .. తమ పోరాట ఫలితమేనంటున్న టీడీపీ
లెక్కలు లేని రెండు లక్షల టన్నుల ఖనిజం , చైనా ఎగుమతులపై అనుమానం
తూర్పుగోదావరి జిల్లాలో ఆండ్రూ మినరల్స్ కు చెందిన లేటరైట్ లీజులలోని ఎండిఎల్ నిల్వ కేంద్రాలలో లెక్కలు లేని రెండు లక్షల టన్నుల ఖనిజాన్ని గుర్తించినట్లుగా గనుల శాఖ డైరెక్టర్ వి జి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఆండ్రూ మినరల్స్ పాత రికార్డులను పరిశీలిస్తే 32 లక్షల టన్నుల లేటరైట్ ను వారు వేదాంత అల్యూమినియం కంపెనీ కి సరఫరా చేశారని 4.65 లక్షల టన్నులు చైనాకు ఎగుమతి చేశారని గుర్తించామని ఆయన వెల్లడించారు. చైనాకు ఎగుమతి చేసిన 4.65 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం లేటరైటా లేక బాక్సైటా అని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్న ఆయన ప్రాథమికంగా మైనింగ్ నిభందనలు ఉల్లంఘించినట్లు తేలిందని పేర్కొన్నారు.
వేదాంత కంపెనీకి లేటరైట్ ఎగుమతి.. బాక్సైట్ గా అనుమానం
ఒడిశాలోని వేదాంత కంపెనీకి 2014- 15 నుండి 2018- 19 జనవరి వరకూ ఆండ్రూ మినరల్స్ దాదాపు ముప్పై రెండు లక్షల టన్నులకు పైగా లేటరైట్ ను సరఫరా చేసినట్లుగా లెక్కలు ఉన్నాయని, అయితే వేదాంత కంపెనీ బాక్సైట్ ను అల్యూమినియం తయారీలో వినియోగిస్తారని, ఈ క్రమంలోనే వేదాంత కంపెనీకి సరఫరా చేసింది లేటరైట్ నా ? బాక్సైట్ నా ? అన్న అనుమానాలున్నాయని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తవ్విన లేటరైట్ ఖనిజాన్ని ప్రాసెస్ చేసి బాక్సైట్ గా మార్చి విక్రయించినట్లు అనుమానాలు ఉన్నాయని గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి .. సమగ్ర దర్యాప్తుకు ఆదేశం
ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్ ఆదాయానికి గండి పడేలా వ్యవహరించినట్లు తేలిందని వెల్లడించారు. ఐదు విజిలెన్సు బృందాలతో ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో అనేక అక్రమాలు బయటపడినట్లుగా వెల్లడించిన గనుల శాఖ అధికారులు ఆండ్రూ మినరల్స్ మైనింగ్ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని, కంపెనీ నిర్దేశిత ప్రాంతంలోనే మైనింగ్ చేశారా లేక సరిహద్దులు దాటి మైనింగ్ చేశారా అనేది డ్రోన్లతో సర్వే చేయించి తేలుస్తామని వెల్లడించారు.
2019 నుండి తవ్వకాలు నిలిపేసిన ఆండ్రూ మినరల్స్ .. ఇప్పుడు విచారణ
మైనింగ్ ప్రదేశంలో భద్రత, రక్షణ నిబంధనలు, బ్లాస్టింగ్ అనుమతులను అన్నింటినీ పరిశీలిస్తామని, నిబంధనల ప్రకారం మైనింగ్ నిర్వహించారా లేదా అని నిగ్గు తేలుస్తామని గనుల శాఖ అధికారులు వెల్లడించారు,ఆండ్రూ మినరల్స్ 2013లో రిజర్వు ఫారెస్ట్ లో గిరిజన పురం, లింగంపర్తి పరిధిలో ఆండ్రూ శ్రీనివాస్, ఇతరుల పేర్లమీద 8 లేటరేట్ లీజులు మంజూరు అయ్యాయి. అప్పటి నుంచి లేటరైట్ మైనింగ్ నిర్వహిస్తున్న ఆండ్రూ మినరల్స్ 2019 నుండి తవ్వకాలను నిలిపి వేసింది. అయినప్పటికీ అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్లు గనుల శాఖ అధికారులు వెల్లడించారు.
విశాఖలోనూ మైనింగ్ అక్రమాలపై రంగంలోకి విచారణ కమిటీ
ఈ అక్రమాలలో తమ శాఖ అధికారుల పాత్ర ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకపక్క తూర్పుగోదావరి విశాఖ జిల్లాల సరిహద్దుల్లో నాతవరం మండలం భమిడికలొద్ది వద్ద మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్న సమయంలో, తూర్పుగోదావరి జిల్లాలో 2019లో తవ్వకాలను నిలిపి వేసిన ఆండ్రూ మినరల్స్ లేటరైట్ తవ్వకాలలో అక్రమాలకు పాల్పడిందని సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని గనుల శాఖాధికారులు వెల్లడించటం గమనార్హం.