విజయవాడ దుర్గగుడిలో మరో వివాదం...క్షురకుడిపై దాడితో ఉద్రిక్తత
విజయవాడ:బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో మరో వివాదం చోటు చేసుకుంది. ఇంద్రకీలాద్రిపై ఓ క్షురకుడిని పాలకమండలి సభ్యుడు ఒకరు కొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది.
పాలకమండలి సభ్యుడి దాడికి నిరసనగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధుల ఆందోళనకు దిగారు. ఈ దాడికి పాల్పడిన పాలకమండలి సభ్యుడు పెంచలయ్య తీరు ఆది నుంచి వివాదాస్పదమేనని...తోటి క్షురకుడిపై దాడి చేసిన పెంచలయ్యపై చర్యలు తీసుకునేంతవరకు ఆందోళన విరమించేది నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలో ఓ క్షురకుడిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య దౌర్జన్యం ఉద్రిక్తతకు కారణమైంది. ఇదే దేవాలయంలో పనిచేస్తున్న ఒక క్షురకుడిని పెంచలయ్య తీవ్రంగా దుర్భాషలాడటంతో పాటు చెయ్యచేసుకున్నారని, అంతేకాదు నాయి బ్రాహ్మణులను అందరినీ కులం పేరుతో దూషించారని క్షవర వృత్తిదారులు ఆందోళనకు దిగారు. దీంతో ఇంద్రకీలాద్రిపై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఆందోళనకు దిగిన క్షురకులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కనక దుర్గమ్మ గుడి పాలకమండలి సభ్యుడిగా వచ్చినప్పటి నుంచి పెంచలయ్య తీరు వివాదస్పదంగానే ఉండేదని ఆరోపించారు. అంతేకాకుండా ఆయన క్యూలైన్లో భక్తుల పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తించేవారని చెబుతున్నారు. ఈ విషయమై ఎన్నో ఫిర్యాదులు రావడంతో పెంచలయ్యను పాలకమండలి చైర్మెన్ గౌరంగబాబు పలు మార్లు హెచ్చరించారని, అయినా ఆయన ప్రవర్తనలో కించిత్ మార్పు కూడా లేదని తెలిపారు.
మరోవైపు పెంచలయ్య తీరుపై కనక దుర్గమ్మ ఆలయ ఉద్యోగులు సైతం గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయం వ్యవహారాల్లో తన కుటుంబసభ్యులు, బంధువులు,స్నేహితులకు పెంచలయ్య ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని, ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దౌర్జన్యం చేస్తుంటాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే క్షుద్రపూజల విషయమై దుర్గ గుడి ఆలయం వివాదంలో చిక్కుకోగా తాజాగా పాలక మండలి సభ్యుడి దౌర్జన్యం ఇంద్రకీలాద్రిని మరోసారి వివాదంలోకి నెట్టింది. దీంతో ఈ వివాదాన్ని ఎలాగైనా పెద్దదికాకుండా సర్దుబాటు చేయాలని ఆలయ పాలకవర్గం, ఉద్యోగులు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా వుండగా నాయీ బ్రాహ్మణుల ఆందోళనకు దిగడంతో క్షురకుడిపై చేయిచేసుకున్న పాలకమండలి సభ్యుడు పెంచలయ్య చేత బాధితుడికి క్షమాపణ చెప్పించడంతో క్షురకులు ఆందోళన విరమించారు. తలనీలాలు తీయించుకున్న వ్యక్తి నుంచి రూ. 10 తీసుకున్నందున పెంచలయ్య తనను బూతులు తిడుతూ చేయి చేసుకున్నారని క్షురకుడు తెలిపాడు. తమకు జీతాలు కూడా ఇవ్వరని, టిక్కెట్ కమిషన్పై మాత్రమే బతుకుతామని, అందుకు సంతోషంగా ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటామని చెప్పారు. పెంచలయ్య దౌర్జన్యంతో దుర్గగుడి ముందు క్షురకులంతా బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొనగా...పరిస్థితి తీవ్రతను గుర్తించిన దుర్గగుడి ఈవో గౌరంగబాబు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వారితో చర్చలు జరిపారు. తమను ఉద్యోగులుగా నియమిస్తూ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఈవో, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న క్షురకుల డిమాండ్లకు హామీ ఇచ్చి...పెంచలయ్యతో క్షమాపణ చెప్పించారు. దీంతో క్షురకులు ఆందోళన విరమించారు.