H-1B Visa ల వ్యవహారంలో భారత్ కు తేల్చి చెప్పిన అమెరికా
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోన్నారు. భారత్ లో ఇది ఆయన మొదటి పర్యటన. శనివారమే ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ మదర్ థెరీసా మిషనరీని సందర్శించారు. అనంతరం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఉదయం విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, ఇతర అధికారులతో సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. హెచ్1బీ వీసా సహా పలు విషయాలు ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
అనంతరం మార్కో రూబియో, జైశంకర్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వీసా, వలస విధానాలలో ఇటీవల వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు మార్కో. ఈ మార్పులనేవి భారత్ ను ఉద్దేశించినవి కాదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా H-1B, F1, J1 వంటి కేటగిరీలపై జరిగిన మార్పులు విస్తృత ప్రపంచ సంస్కరణల ప్రక్రియలో భాగమని ఆయన వివరించారు. వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ తమ దేశం చేపడుతున్న వలస సంస్కరణలను సమర్థించారు.

తమ దేశానికిభారతీయులు, భారతీయ కంపెనీలు గణనీయమైన తోడ్పాటును అందిస్తోన్నాయని రూబియో చెప్పారు. భారతీయ కంపెనీలు ఇప్పటికే 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ పెట్టుబడుల సంఖ్య మరింత పెరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వలస విధానాల మార్పులు భారతదేశాన్ని మాత్రమే ఉద్దేశించినవి కాదని రూబియో పునరుద్ఘాటించారు.
అక్రమ వలసల వల్ల తలెత్తుతున్న సంక్షోభాన్ని తాము ఎదుర్కొంటొన్నామని, అందుకే దేశ వలస వ్యవస్థను ప్రస్తుత వాస్తవాలకు అనుగుణంగా మార్చుతున్నామని వివరించారు. కొన్ని సంవత్సరాలలో 20 మిలియన్ల మందికి పైగా ప్రజలు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించారని ఆయన వ్యాఖ్యానించారు. ఇదొక పెద్ద సవాలుగా మారిందని, దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని రూబియో స్పష్టం చేశారు.
వలస విధానం ఏ దేశానికైనా జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత వహించే విషయమని రూబియో పేర్కొన్నారు. తమ సరిహద్దుల్లోకి ఎవరు, ఏ షరతులపై ప్రవేశించాలో నియంత్రించే హక్కు ప్రతి దేశానికీ ఉంటుందని ఆయన అన్నారు. ఓ దేశం చేసే ప్రతి పని కూడా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని, అందులో వలస విధానం కూడా ఉందని పేర్కొన్నారు. అమెరికాను ప్రపంచంలోనే మోస్ట్ వెల్కమింగ్ దేశంగా అభివర్ణించారు.
ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది ప్రజలు శాశ్వత నివాసితులుగా మారుతున్నారని రూబియో గుర్తుచేశారు. తన తల్లిదండ్రులు కూడా 1956లో క్యూబా నుండి అమెరికాకు వలస వచ్చిన వాళ్లేనని, ఆ తర్వాత శాశ్వత నివాసితులుగా మారారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వలస వ్యవస్థలు నిరంతరం పరిణామం చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి సంస్కరణ ప్రక్రియ అయినా దరఖాస్తుదారులు, ఇతర సంబంధిత వర్గాలకు కొంత తాత్కాలిక ఇబ్బందులను సృష్టిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications