మరో ఎమ్మెల్యే ట్విస్ట్: జగన్ బేజారు, స్పీకర్కు ఫిర్యాదు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో శాసనసభ్యుడు షాక్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ్యుడు కలమట వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అనివార్యమైన స్థితిలోనే తాను వైసిపి తరఫున పోటీ చేశానని ఆయన చెప్పారు.
తండ్రి మోహన్ రావుతో కలిసి టిడిపిలో చేరుతున్నట్లు వెంకటరమణ ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన తాను కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధికోసమే తాను టిడిపిలో చేరుతున్నట్లు తెలిపారు.
భూమా నాగిరెడ్డి, అదినారాయణ రెడ్డి, డేవిడ్ రాజు వంటి ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ఫిరాయింపులు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, విజయవాడలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి జంప్ జిలానీలు హాజరయ్యారు. మంగళవారంనాడు ఏర్పాటైన సమావేశానికి ఆనం బ్రదర్స్, ఆదినారాయణ రెడ్డి, డేవిడ్ రాజు హాజరయ్యారు.

తన రాష్ట్ర పర్యటనలతో, సమావేశాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెమటలు పట్టించాలని ప్రయత్నించిన జగన్ ఫిరాయింపులతో బేజారెత్తినట్లు కనిపిస్తున్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో ఆయన మంగళవారంనాడు హైదరాబాదులోని లోటస్పాండులో సమావేశమయ్యారు.
తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జగన్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఫిర్యాదు చేయనున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లి స్పీకర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications