అనుకున్నదొకటి, అయ్యిందొకటి-వైసీపీకి దక్కని రాజధాని బిల్లుల రద్దు ప్రయోజనం-ఎందుకంటే ?
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను హడావిడిగా ప్రారంభించిన వైసీపీ సర్కార్.. ఆ తర్వాత దాన్ని ఓ కొలిక్కి తీసుకురావడంలో మాత్రం ఆ వేగం కొనసాగించలేకపోయింది. రైతుల అభ్యంతరాలు, న్యాయవివాదాలే ఇందుకు కారణం. తాజాగా ఎవరూ ఊహించనట్లుగా వైసీపీ సర్కార్ రాజధానుల బిల్లుల్ని అమాంతం వెనక్కి తీసేసుకుంది. అయితే ఇందుకు ఇతమిత్థంగా కారణాలు చెప్పడంలో మాత్రం విఫలమైంది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కారణాల మేరకు చూసుకున్నా వైసీపీ సర్కార్ కు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని అర్ధమవుతోంది.

రాజధానులపై వైసీపీ తడబాటు
ఏపీలో అమరావతి స్ధానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన ప్రయత్నం ఇంకా కొలిక్కి రాలేదు. మూడు రాజధానుల ఏర్పాటుకు లాజిక్కులు వెతుక్కోవడంలో అంతగా ఆలోచించని వైసీపీ సర్కార్.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమైంది. దీంతో రాజధానులు కావాలని కోరే వాళ్ల కంటే మూడు రాజధానులు వద్దని, అమరావతే కావాలని కోరే వాళ్లు ఎక్కువగా తెరపైకి వచ్చారు. ఇది అంతిమంగా మూడు రాజధానుల బిల్లుల ఉసురుతీసింది. వైసీపీ ప్రభుత్వం తాజాగా వాటిని వెనక్కి తీసుకోవడంతో రాజధానుల ప్రక్రియ మళ్లీ డోలాయమానంలో పడింది.

అనూహ్యంగా రాజధానుల బిల్లుల రద్దు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ తర్వాత మూడు రాజధానుల్ని ఎవరు వ్యతిరేకించినా ఆగవని ప్రభుత్వం చెబుతూ వచ్చంది. మంత్రులయితే ఏ క్షణమైనా విశాఖకు రాజధాని అంటూ ఊదరగొట్టేశారు. తాజాగా మూడు వారాల క్రితం కూడా మంత్రులు మూడు రాజధానులు తథ్యమన్నారు. కానీ అనూహ్యంగా అసెంబ్లీలో అజెండాలోలోని మూడు రాజధాని బిల్లుల రద్దును ప్రభుత్వం తెరపైకి తెచ్చేసింది. అంతే కాదు గతంలో రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించిన బిల్లుల్ని సైతం వెనక్కి తీసేసుకున్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం చెప్పిన కారణం అమరావతిలో ఉన్న ఒక శాతం అభ్యంతరాల వల్లేనని. వారిని కూడా ఒప్పించి సమగ్రంగా మరో బిల్లు తెస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

అనారోగ్యంతో గెజిట్ ఆలస్యం
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయినా మళ్లీ వారం రోజులకే ఆయన తిరిగి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెబుతున్నా పూర్తిగా కోలుకోవడానికి మరికొంతకాలం పట్టే అవకాశముంది. దీంతో మూడు రాజధానుల బిల్లుల్ని రద్దు చేస్తూ అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించిన బిల్లులకు ఆయన మోక్షం కల్పించాల్సి ఉంది. అప్పుడే అవి గెజిట్ గా మారతాయి. గవర్నర్ కోలుకున్నాకే వీటికి ఆమోదముద్ర పడే అవకాశముంది.

ఆఫీసుల తరలింపుకు అంగీకరించని హైకోర్టు
మూడు రాజధానుల బిలుల్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం మరో బిల్లు ఇంకా ప్రవేశపెట్టలేదు. అయితే హైకోర్టులో మూడు రాజధానులకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉన్న స్టేపై నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టును కోరలేదు. దీంతో హైకోర్టు ఈ స్టేను మరోసారి పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీ, మండలిలో బిల్లులు వెనక్కి తీసుకున్నా ప్రభుత్వం అనూహ్యంగా ఆఫీసుల్ని తరలించే ప్రమాదం ఉందని భావించడం వల్లే ఈ స్టే కొనసాగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుందా అన్న చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ స్టేపై ఎక్కడా మాట్లాడటం లేదు.

జగన్ సర్కార్ కు దక్కని ఊరట
మూడు రాజధానుల బిల్లుల రద్దు విషయంలో వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నా వాటి ఫలితాలు మాత్రం అందడం లేదు. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లులు రద్దయినా రాజధానుల ఏర్పాటు మాత్రం తథ్యమంటూ ప్రకటనలు మాత్రం చేస్తూనే ఉంది. అంటే బిల్లులు రద్దయ్యాయి తప్ప మూడు రాజధానుల నిర్ణయం మారలేదని చెప్పకనే చెబుతోంది. దీంతో బిల్లుల రద్దు ద్వారా హైకోర్టులో పిటిషన్లపై విచారణను తాత్కాలికంగా పక్కనబెట్టించడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా నెరవేరలేదు. హైకోర్టు ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వస్తే తప్ప ఈ బిల్లుల రద్దును పరిగణనలోకి తీసుకోబోమని చెబుతోంది. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై స్టే కూడా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం ఏదీ దీంతో దక్కే అవకాశం లేదని తేలిపోతోంది. మరి కొత్త బిల్లును సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చి మూడు రాజధానులపై సందిగ్ధతను ప్రభుత్వం తొలగిస్తుందా లేక మరింత ఆలస్యం చేస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Recommended Video

అనుకున్నదొకటి, అయ్యిందొకటి
వాస్తవానికి మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకోవడం ద్వారా దీనిపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణను తప్పించుకోవడంతో పాటు అమరావతిలో ప్రజాభిప్రాయాన్ని పట్టించుకున్నట్లు చెప్పుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించింది. కానీ మూడు రాజధానులపై అనుమానాలు ముసురుకోవడంతో సాధ్యమైనంత త్వరగా కొత్త బిల్లు ప్రవేశపెడతామని, కొత్త రాజధానులు తధ్యమని ప్రచారం ప్రారంభించింది. దీంతో అమరావతి రైతుల నుంచి మళ్లీ అభ్యంతరాలు మొదలయ్యాయి. అదే సమయంలో హైకోర్టు కూడా గెజిట్ నోటిఫికేషన్ రాకుండా విచారణ ఆపేందుకు సిద్ధం కాలేదు. అయితే వచ్చే నెల 27కు విచారణ వాయిదా వేయడం ఒక్కటే వైసీపీకి ఇప్పుడు ఊరటగా కనిపిస్తోంది.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications