మురిసిన బాబు, అరుదైన అవకాశం: అమరావతిలో 'నాగార్జున' పాత్ర
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల సాంకేతిక సహకారం అందించనుంది. ఇటీవల కృష్ణా పుష్కరాల నేపథ్యంలో బందర్ రోడ్డులో 8 కి.మీ. పొడవున విద్యార్థులు ప్రహరీ గోడలకు అందమైన పెయింటింగ్ చిత్రాలు వేశారు.
ఇవి చంద్రబాబును ఆకట్టుకున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులను ప్రశంసించారు. వారిలో ఎంతో సృజనాత్మకత ఉందని వారి సేవలను అమరావతి నిర్మాణాల్లో కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
ఈ నెల 22న మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్కిటెక్చర్ కళాశాలకు వెళ్లి.. విద్యార్థులు, అధ్యాపకులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. అమరావతిలో తలపెట్టిన రాజధాని నిర్మాణ పనుల్లో విద్యార్థులు, అధ్యాపకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.
ఈ మేరకు ఎంఓయూ చేసుకోవాలని నిర్ణయించారు. బుధవారం జరగాల్సిన ఈ ప్రక్రియ వాయిదా పడింది. సోమవారం ఈ ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో సహా ప్రతిదీ చైనా, సింగపూర్ కంపెనీలు అందిస్తున్నాయి. అయితే తొలిసారిగా రాష్ట్రానికి చెందిన ఒక ప్రభుత్వ విద్యా సంస్థ సహకారాన్ని రాజధాని నిర్మాణంలో కోరటం గమనార్హం. ఇది అరుదైన అవకాశం.