మురిసిన బాబు, అరుదైన అవకాశం: అమరావతిలో 'నాగార్జున' పాత్ర
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల సాంకేతిక సహకారం అందించనుంది. ఇటీవల కృష్ణా పుష్కరాల నేపథ్యంలో బందర్ రోడ్డులో 8 కి.మీ. పొడవున విద్యార్థులు ప్రహరీ గోడలకు అందమైన పెయింటింగ్ చిత్రాలు వేశారు.
ఇవి చంద్రబాబును ఆకట్టుకున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులను ప్రశంసించారు. వారిలో ఎంతో సృజనాత్మకత ఉందని వారి సేవలను అమరావతి నిర్మాణాల్లో కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

ఈ నెల 22న మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్కిటెక్చర్ కళాశాలకు వెళ్లి.. విద్యార్థులు, అధ్యాపకులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. అమరావతిలో తలపెట్టిన రాజధాని నిర్మాణ పనుల్లో విద్యార్థులు, అధ్యాపకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.
ఈ మేరకు ఎంఓయూ చేసుకోవాలని నిర్ణయించారు. బుధవారం జరగాల్సిన ఈ ప్రక్రియ వాయిదా పడింది. సోమవారం ఈ ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో సహా ప్రతిదీ చైనా, సింగపూర్ కంపెనీలు అందిస్తున్నాయి. అయితే తొలిసారిగా రాష్ట్రానికి చెందిన ఒక ప్రభుత్వ విద్యా సంస్థ సహకారాన్ని రాజధాని నిర్మాణంలో కోరటం గమనార్హం. ఇది అరుదైన అవకాశం.












Click it and Unblock the Notifications