మరొకరిని ముఖ్యమంత్రిగా చూడలేను: బతికి ఉన్నన్ని రోజులూ జగనే సీఎం: జనసేన ఎమ్మెల్యే రాపాక
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ మరోసారి ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు..గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను ప్రస్తావించారు. ఊహాతీతమైన పథకాలను వాస్తవంలోకి తీసుకొచ్చారని చెప్పారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు. ఎవరూ చేయని ఆలోచనలను వైఎస్ జగన్ చేశారని, దాన్ని అమలు చేసి చూపిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబుకు చురకలు..
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ స్థానిక అభివృద్ధికి, సంక్షేమ పథకాలను సమగ్రంగా అర్హులకు చేరవేయడానికి దోహదపడుతున్నాయని రాపాక వరప్రసాద్ అన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే.. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా స్థానికంగా నిరుద్యోగం తలెత్తకుండా చేయగలిగారని చెప్పారు. వలంటర్ల వ్యవస్థను దేశం మొత్తం మెచ్చుకుంటోందని గుర్తు చేశారు. 40 సంవత్సరాల అనుభవం ఉందని, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకొంటోన్న చంద్రబాబుకు వలంటీర్ల వ్యవస్థ గురించి ఆలోచన కూడా చేసి ఉండరని పరోక్షంగా చురకలు అంటించారు.

నేను మరో ముఖ్యమంత్రి చూడలేను..
ప్రజల కోసం నిత్యం తపన పడే ముఖ్యమంత్రిని తాను ఇదివరకు చూడలేదని రాపాక అన్నారు. తాను మరో ముఖ్యమంత్రికి ఇక చూడలేనని తేల్చిచెప్పారు. తాను బతికి ఉన్నన్ని రోజులు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. మరొకరిని ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి స్థానంలో చూడలేనని పేర్కొన్నారు. ఈ భావన తన ఒక్కడిదే కాదని, ప్రజలందరూ అదే అనుకుంటున్నారని రాపాక అన్నారు. ప్రజల మనస్సులో ఉండే విషయాన్నే తాను వెల్లడిస్తున్నానని చెప్పారు.

ప్రజల మనసుల్లోకి చొచ్చుకెళ్లారు..
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే ప్రజల మనసుల్లోకి చొచ్చుకెళ్లారని రాపాక ప్రశంసించారు. హెరిటేజ్ బిజినెస్ చేద్దామనో.. లేక మరే పాల వ్యాపారం చేయాలనో ఆయన అనుకోలేదని, ప్రజలకు ఏం చేయగలనని ఆలోచిస్తుంటారని అన్నారు. రాత్రిపూట వైఎస్ జగన్ నిద్రపోరేమోనని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం రేపటికి ఎలాంటి మేలు చేకూర్చాలనే ధ్యాసతో నిద్రపోకుండా గడుపుతుంటారేమోనని రాపాక అన్నారు.
Recommended Video

ఎమ్మెల్యేల ఇళ్ల ముందు జనం బారులు తీరట్లేదు..
ఏ ప్రభుత్వంలోనైనా తమ సమస్యలను తీర్చాలంటూ, తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ప్రజలు తాము ఎన్నుకొన్న శాసన సభ్యులు, మంత్రుల ఇళ్ల ముందు బారులు తీర్చినిల్చుంటారని, జగన్ ప్రభుత్వంలో ఆ అవసరం లేకుండా పోయిందని రాపాక అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల వద్ద ఎవరూ జనం కనిపించట్లేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా, ఏదైనా అవసరం కోసం తమ వద్దకు వస్తే.. గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇన్ని లక్షల ఇళ్ల పట్టాలను ఒకేసారి మంజూరు చేయదలిచిన ప్రభుత్వాన్ని తాను తొలిసారిగా చూస్తున్నానని రాపాక అన్నారు.












Click it and Unblock the Notifications