కబడ్డీ ఆడుతూ బొక్క బోర్తా పడ్డ స్పీకర్ తమ్మినేని- సీఎం కప్ టోర్నీలో ఘటన
నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి తన వ్యాఖ్యలతో కాకుండా తన చేష్టలతో వార్తల్లో నిలవడం విశేషం. శ్రీకాకుళం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో జరుగుతున్న సీఎం కప్ టోర్నీ ఇందుకు వేదికైంది.
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసతో ఇవాళ సీఎం కప్ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో స్ధానిక క్రీడాకారులు పాల్గొంటున్నారు. అందులో అసంబ్లీ స్పీకర్ కమ్ స్ధానిక ఎమ్మెల్యే కూడా అయిన తమ్మినేని సీతారాంను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. దీంతో టోర్నీకి హాజరైన తమ్మినేని. .. కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా కబడ్డీ కోర్టులోకి దిగారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతపెడుతూ ప్రత్యర్ధి క్రీడాకారుల్ని కవ్విస్తున్నారు. అక్కడే బిగ్ ట్విస్ట్ ఎదురైంది.
కబడ్డీ ఆడుతుండగా.. స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయారు. దాదాపు పది అడుగుల దూరంలో పడిపోయారు. దీంతో వెంటనే కంగారుపడ్డ క్రీడాకారులు, అధికారులు ఆయన్ను లేపి ప్రాధమిక చికిత్స అందించారు. అయితే ఆ తర్వాత వెంటనే కోలుకున్న స్పీకర్ తమ్మినేని తిరిగి కబడ్డీ ఆట కొనసాగించడం విశేషం. ఆటల్లో ఇవన్నీ మామూలే అంటూ క్రీడాకారుల్ని ఉత్సాహపరుస్తూ తమ్మినేని కబడ్డీ కొనసాగించడంతో క్రీడాకారులు కూడా ఉత్సాహంగా ఆయనతో కలిసి ఆడారు. ఆ తర్వాత రెగ్యులర్ మ్యాచ్ కొనసాగింది.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసతో ప్రభుత్వం తరఫున నిర్వహించే ప్రతీ కార్యక్రమంలోనూ తమ్మినేని పాల్గొంటుంటారు. స్పీకర్ అయినా ఎలాంటి మొహమాటం లేకుండా సొంత పార్టీ వైసీపీకి అనుకూలంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారు. స్పీకర్ కంటే ముందు తాను వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అంటూ వాటిని సమర్ధించుకుంటూ ఉంటారు కూడా. అయినా రాజకీయాల్లో సీనియర్ కావడంతో ఆయన్ను జిల్లాలో మిగతా నేతలు కూడా అదే గౌరవంతో చూస్తుంటారు.