నోళ్లకు నల్ల రిబ్బన్తో ధర్నా: లెక్కలు తీసిన జగన్
హైదరాబాద్: అధికార పక్ష సభ్యుల తీరుకు నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సహా పార్టీ సభ్యులు నోళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే స్వేచ్ఛ లేనందు వల్లనే సభను వాకౌట్ చేశామని జగన్ చెప్పారు.
అసెంబ్లీలో స్పీకర్ వ్యవహార శైలిని ఆయన తప్పు పట్టారు. స్పీకర్ అధికార పార్టీ ఎమ్మెల్యేనా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సభాపతా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. అసెంబ్లీలో శుక్రవారంనాడు అధికార పక్ష సభ్యులు 19 సార్లు అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని, అయినా వారిని స్పీకర్ ఏమీ అనలేదని ఆయన గుర్తు చేశఆరు.
తాను ఒక్కసారి బఫూన్ అనే పదం ప్రయోగిస్తే దానికి అభ్యంతరం చెప్పడం విడ్డూరంగా ఉందని జగన్ అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు బాధ్యతారహితమని అన్నారని, అలా అనడం కూడా అన్ పార్లమెంటరీ అనే విషయం స్పీకర్కు తెలుసో లేదోనని ఆయన అన్నారు. సభలో తమ గొంతు వినిపించే అవకాశం లేనందు వల్లనే బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు.
గత మూడు నెలల్లో తమ పార్టీకి చెందిన 14 మంది చనిపోయారని, వాటిపై విచారణ జరపించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిటాల రవి హత్య కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీలో చర్చ చేస్తున్నారని, అవి తప్పుడు ఆరోపణలని చంద్రబాబుకు తెలుసు కాబట్టే జెసి బ్రదర్స్కు టికెట్లు ఇచ్చారని ఆయన అన్నారు.