ఏపీలో రేపటి నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పు- ఈ నెల 20 వరకు సమయాలివే
ఏపీలో రేపటి నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో రేపటి నుంచి జనజీవన కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ తాజా వేళలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళలను అందుకు అనుగుణంగా సవరించారు.
Recommended Video
ఇప్పటివరకూ రాష్ట్రంలో బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకే పనిచేస్తుండగా.. ఇప్పుడు దాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. అయితే, బ్యాంకుల సిబ్బంది తమ పరిపాలనా విధుల నిమిత్తం సాయత్రం 5 గంటల వరకు బ్యాంకుల్లోనే ఉండనున్నారు. ఈ మేరకు బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేయాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకూ ఈ సమయాలు అమల్లో ఉంటాయి.
ఏపీలో కరోనా నేపథ్యంలో బ్యాంకులు పూర్తిస్ధాయిలో సేవలు అందించడం లేదు. ప్రస్తుతం అత్యవసర సేవలు, రోజువారీ సేవల కోసం మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పరిమిత సిబ్బందితో పనిచేస్తుండటమే ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం కర్ఫ్యూ మినహాయింపులు పెంచిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలతో పాటు సేవల్ని కూడా మార్చాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తాజా వేళలు అందుబాటులోకి రానున్నాయి.