AP Budget 2021 నేడే... జెండర్ బడ్జెట్కు రూపకల్పన... ఏయే రంగాలకు ప్రాధాన్యమివ్వబోతున్నారంటే...
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22 నేడు(మే 19) అసెంబ్లీలో ప్రవేశ పెట్టబడనుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి రూ.70,983 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టనుంది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉండటం... కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోవడంతో తాజా బడ్జెట్ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది. గతేడాది 2,24,751.18 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి మరో 6వేల కోట్ల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది.
జెండర్ బడ్జెట్..
దాదాపు 2.25 లక్షల కోట్ల నుంచి 2.30 లక్షల కోట్ల మేర ఈసారి బడ్జెట్ ఉండవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ... మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చేలా తాజా బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్లో మహిళల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్తో నిధుల కేటాయింపులు జరపనున్నారు. మహిళల సంక్షేమ,అభివృద్దికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. అలాగే పిల్లల కోసం కూడా ప్రత్యేక బడ్జెట్ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.గతంలో రాజస్తాన్,గుజరాత్,మధ్యప్రదేశ్,కర్ణాటక,ఒడిశా,కేరళ,ఉత్తరాఖండ్,బిహార్,త్రిపుర,నాగాలాండ్,ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ తరహా జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్దమైంది.
అసెంబ్లీలో బుగ్గన,మండలిలో సుచరిత...
ఉదయం 9 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్గా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతారు. హోంమంత్రి మేకతోటి సుచరిత శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు.గడిచిన 3 నెలల కాలానికి సంబంధించి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మిగతా 9 నెలల కాలానికి ఇది సంపూర్ణ బడ్జెట్. కరోనా నేపథ్యంలో అసెంబ్లీని ఈ ఒక్కరోజే ప్రత్యేకంగా సమావేశపరిచి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
సంక్షేమం,వ్యవసాయానికి పెద్ద పీట...
వైఎస్సార్ పెన్షన్ పేరుతో ప్రభుత్వం అందజేసే సామాజిక పెన్షన్లను వచ్చే జనవరి నుంచి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2250 నుంచి రూ.2500 చొప్పున అందించే ఈ పెన్షన్లకు బడ్జెట్లో రూ.18వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈబీసీ నేస్తం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయం అందించేలా కేటాయింపులు జరపనున్నారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం, జల వనరులు, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి వాటికి బడ్జెట్ కేటాయింపులు జరపనున్నారు. వ్యవసాయ రంగానికి దాదాపు రూ.30వేల కోట్ల బడ్జెట్ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది.