రేపు ఏపీ కేబినెట్ భేటీ- అజెండా ఇదే
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల తేదీల ఖరారు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానంతో పాటుు మరికొన్ని కీలక అంశాలపై చర్చించేందుకు బుధవారం ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది.

రేపు ఏపీ కేబినెట్ భేటీ
ఓవైపు స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ, మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇంకోవైపు ఉగాదికి ఇళ్లపట్టాలు, రాజధాని తరలింపు వంటి వ్యవహారాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇందులో ప్రధానంగా స్ధానిక సంస్ధల ఎన్నికల తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ నెల 5 లేదా 6వ తేదీల్లో స్ధానిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. అదే సమయంలో అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల నిర్వహణ కీలకంగా మారింది. దీంతో అసెంబ్లీ పూర్తి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా లేక ఓటాన్ అకౌంట్ తో సరిపెట్టాలా అన్న అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతోంది. మరోవైపు ఈ నెల 25న ఉగాది సందర్భంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. దీంతో ఈ వ్యవహారంపైనా కేబినెట్ లో ప్రస్తావన రానుంది. దీంతో పాటు ఎన్ఆర్సీపై రాష్ట్రంలో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై కేబినెట్ ఓ తీర్మానం ఆమోదించనుంది.

స్ధానిక ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. కాస్త అటు ఇటుగా ఈ నెల 20 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలు వారం రోజుల కంటే తక్కువ రోజులు మాత్రమే సాగే అవకాశముంది. ఆ లోపే బడ్జెట్ లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుంటారు. ఏ బడ్డెట్ ప్రవేశపెట్టాలనే అంశాన్ని రేపటి కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారు.

ఉగాదికి ఇళ్లపట్టాల పంపిణీ
ఉగాది సందర్బంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్ధలాలు పంపిణీ చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే భారీ కసరత్తు కూడా చేస్తోంది. దీనిపై తాజా పరిస్ధితిని రేపటి కేబినెట్ భేటీలో చర్చించి ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు.
Recommended Video


ఎన్సార్సీకి వ్యతిరేకంగా తీర్మానం
అలాగే దేశవ్యాప్తంగా సమస్యగా మారిన ఎన్సార్సీ వ్యవహారంపై రాష్ట్రంలోనూ వైసీపీ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న ముస్లిం నేతలు, సాధారణ పౌరులు కూడా రోజూ ఎన్సార్సీకి వ్యతిరేకంగా ఏదో ఒక కార్యక్రమ చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఎన్సార్సీ విషయంలో తెలంగాణలోనూ అసెంబ్లీ తీర్మానం చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ముందుగా రేపటి కేబినెట్ లో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆమోదిస్తారు.
వీటితో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల తీరు, వైసీపీ మ్యానిఫెస్టోలో మిగిలిన ఉన్న అంశాలతో పాటు మరికొన్ని టేబుల్ అజెండా ఐటమ్స్ పైనా కేబినెట్ చర్చించబోతోంది.












Click it and Unblock the Notifications