ఎపి రాజధానికి జులైలో శంకుస్థాపన: నారా లోకేష్ కాల్ సెంటర్
గుంటూరు/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ డిజైన్ ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతుందని, జులైలో మంచి రోజు చూసి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. భూసమీకరణ మొదలైన నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా నేలపాడు రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజధాని కోసం స్వచ్చంధంగా భూములిచ్చేందుకు ముందుకు వచ్చిన నేలపాడు రైతులను మంత్రి అభినందించారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఇతర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేపడుతామని ఆయన చెప్పారు.
కాగా, భూసమీకరణకు సంబంధించి భూసమీకరణ ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ నేతృత్వంలో 34 మంది డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో 27మంది రెవెన్యూ బృందాలు రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి భూసమీకరణకు సంబంధించిన పత్రాలను రైతుల నుంచి స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సంక్రాంతి వరకు పూర్తి చేయాలని గురువారంనాడు గుంటూరు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో సంక్రాంతిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ కాల్సెంటర్ను ఆ పార్టీ యువనేత నారా లోకేష్ శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ప్రారంభించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఈ కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 మంది ఈ కాల్సెంటర్లో విధులు నిర్వహించనున్నారు. కాల్సెంటర్ పనితీరును నేతలకు లోకేష్ వివరించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యకర్తలకు ఈ కాల్సెంటర్ అందుబాటులో ఉంటుందని నారా లోకేష్ ప్రకటించారు.
జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్ పథకం కూడా అమలులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. కాల్సెంటర్ నెంబర్ 730629999, ఫ్యాక్స్నెంబర్ 7306199999కు ఫోన్ చేసి ఏ కార్యకర్త అయినా తమ సందేహాలను, సమస్యలను తీర్చుకోవచ్చని లోకేష్ ప్రకటించారు.