త్రిశంఖు స్వర్గంలా ఏపీ రాజధాని వ్యవహారం: రాజధాని ఏది? ఏపీ ప్రజల్లో కొత్త చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రగడ మరోమారు కొనసాగుతోంది. జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకుని మూడు రాజధానులు బిల్లులను చట్టం చేసినా ఆ చట్టాలను తిరిగి ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఏపీ హైకోర్టు రాజధాని అమరావతి అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైసిపి నేతలు కొత్త పాట అందుకున్నారు. 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ, అప్పటివరకు రాజధాని విషయంలో ఎలాంటి చట్టాలు చేయడానికి లేదన్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి వ్యవహరించలేదని, తామే రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.

నాలుగో రాజధాని, హైదరాబాద్ పేరు తెరమీదకు తెచ్చిన వైసీపీ
వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ 2024 వరకు రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ అని తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయలేని పరిస్థితుల్లో వైసిపి నాలుగో రాజధాని హైదరాబాద్ పేరు తెరమీదకు తీసుకు వస్తుందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి వ్యవహార శైలితో రెంటికీ చెడ్డ రేవడిలా ఏపీ పరిస్థితి తయారైంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి చోటు చేసుకుంది.

ఏపీ రాజధానిని మరింత ప్రశ్నార్ధకం చేసిన వైసీపీ
మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని వైసీపీ మంత్రులు స్పష్టం చేయగా, కోర్టు తీర్పు సి ఆర్ డి ఏ చట్టం ప్రకారం రాజధాని అమరావతి అభివృద్ధి చేయాలని పేర్కొంది. ఇక ఈ సమయంలో మళ్లీ మూడు రాజధానులు బిల్లు సభలో ప్రవేశపెట్టే అంశంపై వైసీపీ అధినాయకత్వంలో తర్జనభర్జన కొనసాగుతోంది. ఈ క్రమంలో 2024 వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ కి రాజధానిని మరింత ప్రశ్నార్థకం చేసింది.

రాజధాని అమరావతి అభివృద్ధి శూన్యం , మూడు రాజధానులు ఏర్పాటు లేదు
అసలే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి శూన్యం గా మారింది. ఇక మూడు రాజధానులు నిర్ణయాన్ని అమలు చేయకపోవడంతో రాజధానిని ఏర్పాటు చేస్తున్న నగరాల్లోనూ అభివృద్ధి ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పడం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మారుస్తుంది అన్న భావన వ్యక్తమవుతోంది.

ఏపీ రాజధానిపై కోర్టు చెప్పినా ప్రభుత్వ వికారి మారదా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని, ఆ విధంగా కేంద్రం చట్టం చేసిందని, అందుకే 3 రాజధానుల నిర్ణయాన్ని అమలు చేయలేకపోతున్నామన్నట్టు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజధాని పై ప్రభుత్వ వైఖరి మారదా అన్న ప్రశ్నను ఉత్పన్నమయ్యే లా చేస్తుంది. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని పేర్కొన్నా బొత్స వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని విషయంలో బొత్స చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది.

నాలుగో రాజధాని హైదరాబాద్ .. ఎద్దేవా చేసిన టీడీపీ
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని ఇక నుండి మూడు రాజధానులు పోయి నాలుగో రాజధాని హైదరాబాద్ కూడా వచ్చి చేరిందని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ కు అన్నివిధాలుగా ఉపయోగపడే తెలంగాణ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి జగన్ ఏపీ ని సర్వ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నేతలు మనసులో కుట్ర దాగుందని, అది మరోసారి బయటపడిందని అంటున్నారు.
Recommended Video

త్రిశంఖు స్వర్గంలా ఏపీ రాజధాని వ్యవహారం
తెలుగుదేశంపార్టీ ఆరోపణల మాట అటుంచితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ వైఖరి ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన వైసీపీ మంత్రులు, ఇప్పుడు తాజాగా నాలుగో రాజధాని హైదరాబాదు పేరు తెరమీదకు తీసుకురావడం ఏపీ రాజధాని త్రిశంకు స్వర్గంలా మారిందని అభిప్రాయానికి ఊతమిస్తోంది. రాజధానిగా అమరావతిని కొనసాగించే ఆలోచన లేని వైసీపీ ప్రభుత్వం, తాజాగా హైదరాబాద్ పేరు తెరపైకి తెచ్చినట్లు ఏపీ వాసులు భావిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ రాజధాని విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడం, ఇంకా సర్కార్ ప్రజలను డైలమాలో ఉంచడం శ్రేయస్కరం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications