అయ్యన్నపాత్రుడు బెయిల్ ను హైకోర్టులో సవాల్ చేసిన సీఐడీ-మధ్యాహ్నం విచారణ
ఏపీలో టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడుకు ఫోర్జరీ కేసులో నిన్న విశాఖ కోర్టు ఇచ్చిన బెయిల్ పై సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఫోర్జరీ కేసులో అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన ఇద్దరు కుమారులు విజయ్, రాజేష్ పాత్రపై ఆధారాలు ఉన్నా దిగువ కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ఆరోపిస్తోంది. దీంతో హైకోర్టులో ఈ మేరకు బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన ఇంటి వెనుక ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కబ్జా చేశారని ఆరోపిస్తూ సీఐడీ అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేష్ ను నిన్న తెల్లవారుజామున అరెస్టు చేసింది. ఈ మేరకు వీరిద్దరినీ విశాఖ సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే విచారణ జరిపిన కోర్టు.. వీరి రిమాండ్ ను తిరస్కరించింది. అదే సమయంలో బెయిల్ కూడా ఇచ్చి విడుదల చేసింది. దీంతో సీఐడీ దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను హైకోర్టు మధ్యాహ్నం విచారణ జరపనుంది.
ఈ కేసులో అయన్నపాత్రుడితో పాటు ఆయన ఇద్దరు కుమారుల పాత్రపై ఆధారాలు ఉన్నాయని సీఐడీ వాదిస్తుండగా... ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీసీ నేతను టార్గెట్ చేస్తోందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఐడీ ఈ కేసులో బెయిల్ లభించిన అయన్నపాత్రుడు, ఆయన కుమారుడిని తిరిగి అరెస్టు చేసేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది.