పెట్టుబడులెలా వస్తాయి?: కాల్ మనీపై డిప్యూటీ సీఎంపై బాబు ఫైర్!, పోలీసులపై వేటు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'కాల్ మనీ' విషయంలో ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల పైన చంద్రబాబు తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది.
ఇలాంటి అక్రమాలు జరిగితే కొత్త రాజధాని బెజవాడకు పెట్టుబడులు ఎలా వస్తాయని పోలీసు అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఫిర్యాదులు అందినప్పుడు వెంటవెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారని తెలుస్తోంది. ఏపీ కేబినెట్ భేటీలో ఇదే ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
గౌతమ్ సవాంగ్ సెలవు రద్దయ్యే అవకాశం, పోలీసులపై వేటు
కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో గౌతమ్ సవాంగ్ సెలవు అంశం కూడా వివాదాస్పదమైంది. ఆయన నెల రోజుల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లేందుకు సెలవు పెట్టుకున్నారు. అయితే, కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో ఆయన సెలవు రద్దయ్యే అవకాశముంది.

కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల పైన వేటు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పడమట సీఐ దామోదర్ను ట్రాఫిక్కు బదలీ చేశారు. మరో ఆరుగురి పైన కూడా వేటు పడే అవకాశముంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ట్రాఫిక్ విభాగంలోకి బదలీ చేసి, సమర్థులను నియమించనున్నారు. ఆరోపణలు ఎధుర్కొంటున్న పోలీసు అధికారుల జాబితా సేకరిస్తున్నారు.
మాఫియా డాన్లా చంద్రబాబు: నల్లపురెడ్డి
సీఎం చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. బాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని, తన పార్టీ అనుచరులతో అక్రమాలు చేయిస్తూ రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications