ఆ మూడు రాష్ట్రాలకు ఇసుక వెళ్లిపోతోంది-అడ్డుకోవాలని చంద్రబాబు ఆదేశాలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. ఇదే ఇప్పుడు అక్రమార్కులకు వరంగా మారింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకకు ఏపీ నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి సీరియస్ అయ్యారు.
ఏపీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ కు, తమిళనాడులోని చెన్నైకి, కర్నాటకలోని బెంగళూరుకు అక్రమ ఇసుక తరలిపోతోందని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. పొరుగు రాష్ట్రాలకు ఇలా ఇసుక అక్రమ రవాణా కాకుండా అడ్డుకోవాలని ఆధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలన్నారు.

ఉచిత ఇసుక విధానంపై వస్తున్న ఫిర్యాదుల్ని సీరియస్ గా తీసుకోవాలని, ఫిర్యాదుల స్వీకరణకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ విధానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. గ్రామ పంచాయతీల పరిధిలో సొంత అవసరాలకు ట్రాక్టర్లలో ఇసుక తరలింపుకు అనుమతి ఇచ్చినందున, వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చూడాలన్నారు. అలాగే ఇసుక రీచ్ లలో తవ్వకాలను ప్రైవేటుకు అప్పగించడంపైనా దృష్టిపెట్టాలని కోరారు.












Click it and Unblock the Notifications