జగన్ యుద్ధతంత్రం.. ఎన్నికల మంత్రం ఫలిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యుద్ధతంత్రాన్ని రచిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే వ్యూహాలను రచిస్తున్న జగన్ ఈసారి ఎన్నికలకు వైసీపీకి ఎవరు దగ్గరవుతారు? ఎవరు దూరమవుతారు? కులాలవారీగా వచ్చే ఓట్లెన్ని? మహిళలను ఆకట్టుకోవడం ఎలా? వారికోసం ప్రత్యేకంగా ఏమైనా సంక్షేమ పథకాలు రూపొందించాలా? అనే యోచనలో ఉన్నారు.
మహిళల ఓట్లపై ప్రత్యేక దృష్టి
మహిళలను అక్కచెల్లెమ్మలంటూ సంబోధించే జగన్కు గత ఎన్నికల్లో వారు బాగా పట్టం కట్టారు. అర్థరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేశారు. ఈసారి మహిళల ఓట్లే కీలకమని భావిస్తున్న జగన్ వారికోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నారు. త్వరలోనే వాటిని ప్రకటించబోతున్నారు. మద్యనిషేధం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతిమంగా మహిళల ఓట్లు ఏ పార్టీకి వెళ్లకుండా గుంపగుత్తగా వైసీపీకే పడేలా ఉండాలనే ప్రణాళికలో జగన్ ఉన్నారు.
జిల్లాల విభజన కలిసి వస్తుంది!!
ఏపీని 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు విభజించడంవల్ల లాభమే కలుగుతుందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి లాభం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రాయలసీమలోనే జిల్లా కేంద్రాలపై రగడ జరుగుతుండటంతో వాటిని సరిదిద్ది ఎన్నికలకు ఆటంకం లేకుండా చూడాలని సీనియర్ మంత్రులకు బాధ్యతలప్పగించారు. వాటిని చక్కదిద్దగలిగితేనే రాయలసీమ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
ఈసారి కాపు ఓట్లు రావు..!!
గత ఎన్నికల్లో కాపు ఓట్లు వైసీపీకి బాగానే పడ్డాయి. అయితే కాపు రిజర్వేషన్లు తొలగించడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను కాపులు వైసీపీకి ఓటేయరు. మరోవైపు పవన్కల్యాణ్ ఉండటంతో జగన్ కాపుల ఓట్లపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అందుకే ఈసారి బీసీ మంత్రం జపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చేసిన సామాజిక న్యాయం, మంత్రివర్గంలో స్థానం కల్పించడంలాంటివన్నీ ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్రను కూడా ముఖ్యమంత్రి నిర్వహింపచేశారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, రెడ్లతోపాటు బీసీల్లో 70 శాతం వైసీపీవైపు తిప్పుకుంటే ఈసారి ఎన్నికల్లో ఈజీగా గెలుపొందవచ్చనేది జగన్ భావనగా ఉంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అయిపోయేలోగానే ఎన్నికల షెడ్యూల్ రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.