సచివాలయానికి ఎందుకు రారు ...? ఐఏఎస్ ల తీరుపై సీఎం జగన్ సీరియస్.. ఇకపై కుదరదంటూ వార్నింగ్..
ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారుల వ్యవహారశైలిపై సీఎం జగన్ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వారంతా తమ పద్ధతి మార్చుకోవాల్సిందేనంటూ స్పష్టం చేశారు. లేకపోతే భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని ఐఏఎస్ లకు జగన్ తేల్చిచెప్పారు. ఐఏఎస్ లను సైతం అన్నా అంటూ పలకరించే సీఎం జగన్ ఆగ్రహంతో వారంతా విస్తుపోవాల్సి వచ్చింది.

సచివాలయం ఐదురోజులే..
ఏపీ సచివాలయం హైదరాబాద్ నుంచి అమరావతికి మారాక ఐదు రోజుల పని దినాల పద్ధతిని అప్పటి సీఎం చంద్రబాబు అమలు చేశారు. చంద్రబాబు తర్వాత ఆయన స్ధానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ కూడా ఐదు రోజుల పనిదినాలను మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని మారినా ఇంకా హైదరాబాద్ ను వీడని సచివాలయ ఉద్యోగులు, కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐదు రోజుల పనిదినాలను కూడా సీరియస్ గా తీసుకోవడం మానేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి అమరావతి రావడం, తిరిగి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక్కొక్కరుగా తిరిగి హైదరాబాద్ కు జారుకోవడం ఓ అలవాటుగా మార్చుకున్నారు.

కుంటుపడుతున్న పాలన..
హైదరాబాద్ నుంచి ఒక్కసారిగా అమరావతికి రావాలంటే ఉద్యోగులకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో సీఎంలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఉద్యోగులకు ఓ వరంగా మారిపోయింది. ఐదు రోజుల పనిదినాల్లోనూ పూర్తిగా పని చేయకుండా సోమవారం మధ్యాహ్నానికి రావడం, తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోతుండటంతో ప్రభుత్వ పాలన కుంటుపడుతోంది. కీలక ఫైళ్లన్నీ పెండింగ్ పడిపోవడంతో పాటు అసలు సచివాలయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో కీలక సమయాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం అడిగే ఫైళ్లను సైతం ఇచ్చేవారు కరవవుతున్నారు. ఇన్నాళ్లూ దీన్ని చూస్తూ చూస్తూ వదిలేసిన జగన్ ఇవాళ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. దీంతో ఐఏఎస్ అధికారులకు చుక్కలు కనపడ్డాయి.

జగన్ అగ్రహంతో ఐఏఎస్ ల బెంబేలు..
ఐదు రోజుల పనిదినాలను దుర్వినియోగం చేస్తూ జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారుల తీరుపై సీఎం జగన్ ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో సీరియస్ అయ్యారు. ఇలాగైతే ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకెలా వెళతాయని వారిని ప్రశ్నించారు. పని దినాల్లో కూడా సచివాలయంలో కనిపించకపోతే ఎలా అంటూ అక్షింతలు వేశారు. ఇకపై అలా కుదరదని, వారాంతాలతో పాటు పని దినాల్లోనూ అమరావతి విడిచి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పేశారు. ముందస్తు అనుమతి లేకుండా హైదరాబాద్, ఢిల్లీ పర్యటనలకు వెళితే చర్యలు తప్పవన్నారు.

జగన్ ఇచ్చిన అలుసేనా..
ఐదు రోజుల పనిదినాలను సైతం సీరియస్ గా తీసుకోకుండా అమరావతి విడిచి వెళ్లిపోతున్న ఐఏఎస్ అధికారులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం క్షణాల్లో ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు ఓ కారణం జగన్ రోజూ సచివాలయనికి రాకపోవడమనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రోజూ సచివాలయానికి వచ్చేవారు. దీంతో అధికారులు, సిబ్బందిలోనూ ఆ భయం ఉండేది. కానీ జగన్ మాత్రం అమరావతిపై అయిష్టతో, లేక సొంతిట్లో నుంచి రివ్యూలు చేసుకోవచ్చన్న ఆలోచనతో తెలియదు కానీ సచివాలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కీలక సమావేశాలన్నీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే కానిచ్చేస్తున్నారు. దీంతో ఐఏఎస్ అధికారులతో పాటు సచివాలయంలోని ఉద్యోగులకూ ఇదే అలుసుగా మారిపోయింది.

సచివాలయం మొహం చూడని మంత్రులు..
అదే సమయంలో సీఎం రోజూ రాకపోవడంతో ఆయన కేబినెట్ లోని మంత్రులు కూడా సచివాలయానికి రావడం మానేశారు. దీంతో ఏ ఒక్క ఉద్యోగికీ ప్రభుత్వంపై ఎలాంటి భయాలు ఉండటం లేదని సచివాలయంలో పరిస్దితి చూస్తే అర్దమవుతుంది. అయితే తాజాగా పలుమార్లు మంత్రులను ప్రతీ బుధవారం కచ్చితంగా సచివాలయానికి రావాలని చెప్పిన జగన్... తాజాగా ఐఏఎఎస్ అధికారులకూ క్లాస్ పీకడాన్ని బట్టి చూస్తే వీరి గైర్హాజరీతో ప్రభుత్వ పాలనపై పడుతున్న ప్రభావం ఏమిటో అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications