పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రానికి జగన్ విజ్ఞప్తి .. జలశక్తి మంత్రితో భేటీలో సీఎం జగన్ చెప్పిందిదే
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం నుండి తగిన సహాయం చేయవలసిందిగా మంత్రి షెకావత్ ని కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన వ్యయం ఆమోదించండి : సీఎం జగన్
జల శక్తి మంత్రితో భేటీ అయిన సీఎం జగన్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై నీలి నీడలు కమ్ముకున్నాయని ఏపీలో ప్రచారం జరుగుతున్న వేళ, నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడం కోసం కేంద్ర సహకరించాలని జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన వ్యయం 55, 656 కోట్ల రూపాయలను కేంద్రం ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు భూసేకరణ, పునరావాస పనులకు అయ్యే ఖర్చును కూడా కేంద్రమే రియంబర్స్ చేయాల్సిందిగా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు సీఎం జగన్.

పెండింగ్ బకాయిలు త్వరగా ఇవ్వండి
పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చులు ఇంకా 1779 కోట్ల రూపాయలను రియంబర్స్ చేయాల్సి ఉందని, అవి 2018 నాటి పెండింగ్ బకాయిలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన జగన్ పెండింగ్ బిల్లులను త్వరగా ఇవ్వాలని కోరారు. పోలవరం నిర్వాసితుల విషయంలో 2005 - 2006 తో పోలిస్తే , 2017 -2018 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్న జగన్, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ప్రభుత్వానికి భారంగా మారుతుందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే ఖర్చు మరింత పెరుగుతుంది
లక్ష మందికి పైగా కుటుంబాల సంఖ్య పెరగడంతో ఆర్ అండర్ కోసం పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణం పై కేంద్రం దృష్టి సారించాలని, ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగితే ఖర్చు మరింత పెరుగుతుందని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు వివరించారు . ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, అందుకు కేంద్ర సహకారం ఎంతో అవసరమని ఆయన జలవనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
Recommended Video

గోదావరి కావేరి నదుల అనుసంధానంపై చర్చించిన జగన్
అలాగే గోదావరి కావేరి నదుల అనుసంధానంపై చర్చించటం కోసం కేంద్ర జల వనరుల శాఖ సహకారం అందించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులపై సానుకూలంగా స్పందించిన గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్రానికి తగిన సహాయం అందిస్తామని పేర్కొని, నదుల అనుసంధానంపై చర్చించాలని జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ ను గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు . దీంతో జల శక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications