మున్సిపల్ ఫలితాలపై జగన్ ట్వీట్-ఓటర్లకు ధన్యవాదాలు- 100కు 97 మార్కులొచ్చాయి...
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. కడప, నెల్లూరు వంటి జిల్లాల్లో వైసీపీ మరోసారి ఏకపక్ష ఫలితాలు సాధించింది. వైసీపీ హవాలో విపక్ష టీడీపీ చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సహా పలు చోట్ల అడ్రస్ లేకుండా పోయింది. దీంతో ఈ ఫలితాలపై సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు.
ఏపీలో నేడు ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. ఫలితాలపై ఆయన ఉద్వేగభరిత ట్వీట్ చేశారు. ఇందులో వైసీపీని ఘన విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 100కు 97 శాతం విజయాలు అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ విజయంలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అన్నింటికంటే మించి కుప్పంలో తొలిసారి వైసీపీ జెండా ఎగరడంపై సీఎం జగన్ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘనవిజయాన్ని అందించినట్లు సీఎం జగన్ తన ట్వీట్ లో తెలిపారు. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 శాతం మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు అంటూ సీఎం జగన్ తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు. తద్వారా ఇప్పటివరకూ గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వైసీపీకి ప్రజా మద్దతు లభించిందని జగన్ తన ట్వీట్ లో తెలిపారు.
వైసీపీ సాధిస్తున్న వరుస విజయాల పరంపర తాజా మున్సిపల్ ఎన్నికల్లోనూ సాగడంతో ఇక 2024 వరకూ వైసీపీకి ఎదురులేదని భావించవచ్చు. ఇప్పటికే 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీలు అందుకుంటున్న వైసీపీ... ప్రత్యర్ధులకు అందనంత దూరంలో నిలిచింది. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ మించి ఓట్లు, సీట్ల కంటే కూడా భారీ మెజారిటీలే విపక్షాల్ని కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.