కోవిడ్ పోరులో ఏపీ మేటి- వాలంటీర్లే వెన్నెముక-దావోస్ వేదికపై సగర్వంగా జగన్
రెండేళ్ల క్రితం మొదలై ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారనికి తీసుకోవాల్సిన చర్యలపై దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. తనదైన శైలిలో రాష్ట్రం కోవిడ్ ను ఎదుర్కొన్న విధానంపై ప్రసంగించారు. కోవిడ్ పై పోరులో ఏపీ భారత్ లోనే ఎలా మేటిగా నిలిచిందో జగన్ అంతర్జాతీయ వేదికపై వివరించారు.

దావోస్ సదస్సులో కీలక చర్చ
దావోస్ లో నిన్న ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇవాళ ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అనే అంశంపై కీలక చర్చ జరిగింది. ఇందులో పలువురు పారిశ్రామిక వేత్తలు, విదేశీ నేతలతో పాటు సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారిని వివిధ దేశాలు, ప్రభుత్వాలు ఎదుర్కొన్న విధానం, భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ తోపాటు విదేశీ నేతలు, పారిశ్రామిక వేత్తలు కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

జగన్ కీలక ప్రసంగం
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఫ్యూచర్ ఫ్రూఫింగ్ సిస్టమ్స్ పై జరిగిన చర్చలో జగన్ కీలక ప్రసంగం చేశారు.
ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సీఎం జగన్ అంతర్జాతీయ వేదికపై ఏకరువు పెట్టారు. భారత్ కోవిడ్ మహమ్మారితో తీవ్రంగా సతమతమైన వేళ ఏపీ మాత్రం ఎంతో మెరుగ్గా దాన్ని ఎదుర్కొందని జగన్ తెలిపారు. దీంతో మరణాల రేటు కూడా ఏపీలో తక్కువగా నమోదైందని జగన్ గుర్తుచేశారు. దీంతో పాటు ఏపీలో అమలు చేస్తున్న పలు ఆరోగ్య పథకాలను కూడా జగన్ అంతర్జాతీయ నేతలకు వివరించారు.

వాలంటీర్ల సేవలపై జగన్
ఏపీ ప్రభుత్వం వైద్య రంగంపై అత్యంత శ్రద్ధ చూపుతోందని సీఎం జగన్ దావోస్ సదస్సులో తెలిపారు. ప్రతీ 50 ఇళ్లకూ ఓ వాలంటీర్ ను నియమించామని, కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 44 సార్లు ఇంటింటి సర్వే చేపట్టామని జగన్ వెల్లడించారు. వాలంటీర్ల సాయంతో ఇంటింటి సర్వే చేపట్టి రోగుల్ని గుర్తించామన్నారు. దేశంలో ఏపీలోనే అత్యల్పంగా కోవిడ్ మరణాల రేటు నమోదు చేసింది జగన్ గర్వంగా చెప్పారు. ఏఫీలో పెద్దగా ప్రైవేట్ కార్పోరేట్ ఆస్పత్రులు లేవని,
కోవిడ్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని జగన్ వివరించారు. ప్రభుత్వాలు నివారణ, చికిత్సలపై దృష్టిసారించాలని జగన్ కోరారు. పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ పెడుతున్నామని, ప్రస్తుతం 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications