జగన్, నవీన్ పట్నాయక్ భేటీ ఫలప్రదం- కీలక నిర్ణయాలు- ఇరు రాష్టాలకూ ఊరట
ఏపీ-ఒడిశా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ ఇవాళ భువనేశ్వర్ లోని సచివాలయంలో భేటీ అయ్యారు. ముఖ్యంగా సరిహద్దు సమస్యలైన కొటియా గ్రామాలు, నేరడి బ్యారేజ్, జంఝావతి డ్యాంలపై వీరిద్దరూ చర్చించారు. ఈ సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలూ ఓ అంగీకారానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ-ఒడిశా మధ్య దశాబ్దాలుగా కొటియా గ్రామాల సమస్య కొనసాగుతోంది. దీనిపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఒడిశా ఇబ్బందుల్లో పడుతోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఈ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నవరత్నాల్ని సైతం అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే తాజాగా పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించింది. దీంతో ఆయా గ్రామాల్లో వైసీపీ నేతలకూ, ఒడిశాకు చెందిన ప్రజా ప్రతినిధులకు మధ్య ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో కొటియా గ్రామాల సమస్యను బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సీఎం జగన్ దృష్టికి తెచ్చారు.
అలాగే వంశధార నదిపై నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ తో పాటు జంఝావతి డ్యాంపైనా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణం వల్ల ఒడిశాలో గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉండటంతో ఒడిశా వీటిని వ్యతిరేకిస్తోంది. దీంతో సీఎం జగన్ , ఇవాళ నవీన్ పట్నాయక్ తో జరిగిన భేటీలో దీన్ని కూడా ప్రస్తావించారు. వీటిపై ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు.
అధికారంలోకి వచ్చాక తొలిసారి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయిన సీఎం జగన్.. ఇవాళ భేటీ సందర్భంగా చాలా ఉల్లాసంగా కనిపించారు. రాజకీయాల్లో తనకంటే ఎంతో సీనియర్ అయిన నవీన్ పట్నాయక్ తో భేటీ కావడం, కీలకాశాంలపై జగన్ చర్చలు జరపడంపై ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో హర్షం వ్యక్తం అవుతోంది.
వీరిద్దరి భేటీ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంల సంయుక్త ప్రకటన వెలువడింది. ఇందులో తమ మధ్య సరిహద్దు వివాదాలపై సమావేశం ఫలప్రదంగా సాగినట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు సరిహద్దులు మాత్రమే కాకుండా ఘనమైన వారసత్వాన్ని కూడా పంచుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఇరు రాష్ట్రాలు కష్టకాలంలో తుపాను సమయాల్లో కలిసి పనిచేసినట్లు గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఇవాళ సాగిన భేటీలో జల వివాదాలతో పాటు ఉమ్మడి సరిహద్దులు, వామపక్ష తీవ్రవాదంపై చర్చించినట్లు తెలిపారు.
కొటియా గ్రామాల సమస్యతో పాటు నేరడి బ్యారేజ్, జంఝావతి డ్యాం వివాదం, పోలవరం ముంపు సమస్య, బహుదా నదికి నీటి విడుదలపై కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. అలాగే బలిమెల రిజర్వాయర్, ఎగువ సీలేరు లో విద్యుత్ ఉత్పత్తిపైనా నిరభ్యంతర పత్రాలు జారీ చేసుకోవాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ, బెర్హంపూర్ యూనివర్శిటీల్లో పరస్పరం తెలుగు, ఒడిశా భాషలకు ప్రత్యేక విభాగాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు.
అలాగే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని స్కూళ్లలో తెలుగు, ఒడిషా భాషల టీచర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అలాగే ఇరు భాషా పాఠ్యపుస్తకాల సరఫరా, భాషా పరీక్షల నిర్వహణ చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎస్ లతో ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు ఈ ప్రకటన తెలిపింది.