చంద్రమోహన్ మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్,తెలంగాణా సీఎం కేసీఆర్ సంతాపం
తెలుగు చిత్ర పరిశ్రమ ఈ రోజు ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది. విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటనతో దశాబ్దాల కాలంగా ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ ఈరోజు మృతి చెందడంతో సినీ ప్రముఖులతో పాటుగా, రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు చంద్రమోహన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చంద్రమోహన్ స్ఫూర్తితో ఎంతోమంది నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డ గా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు.

తెలుగు చిత్రసీమకు ఆయన మరణం తీరని లోటు అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రమోహన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన ప్రముఖ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం అని అభిప్రాయపడ్డారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు.
చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. చంద్ర మోహన్ మృతితో కలిసి పనిచేసిన తిని ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్లో సోమవారం రోజు చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కాగా చంద్రమోహన్ సరసన నటించిన ఎంతో మంది హీరోయిన్లు ఆయన సినిమా ద్వారానే స్టార్ హీరోయిన్ లుగా మారారు.ఆయన టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో అందర్నీ మెప్పించారు.












Click it and Unblock the Notifications