పెళ్లిళ్లపై రాహుల్, డిగ్గీలపై వివేకా వ్యాఖ్య: జగన్పైనా
అసలు నాయకుడికి పెళ్లి లేదు, ముసలి నాయకులకు పెళ్లిళ్లా అని ఆనం వివేకానంద రెడ్డి రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ వంటి బఫూన్లను పక్కన పెట్టాలని ఆయన సూచించారు. డీక్కీ డక్కా రాజాలొచ్చి పార్టీని నాశనం చేశారని ఆయన అన్నారు.
అధికారం కోసం పార్టీ పెడితే ప్రజలు అదరించబోరని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు అర్థమైందని ఆయన అన్నారు. కాంగ్రెసులో కొంత మంది మంత్రులు కోట్లు సంపాదించి పార్టీని వీడారని వివేకానంద రెడ్డి ఆరోపించారు.
మరో నాయకుడు దేవినేని నెహ్రూ మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్పై తీవ్రంగా మండిపడ్డారు. వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని జైరాం రమేష్ను రాష్ట్రానికి పంపించారని ఆయన వ్యాఖ్యానించారు. జైరాం రమేష్ వ్యవహార శైలి సీమాంధ్ర ప్రజలకు నచ్చలేదని, దాంతో ప్రజలు సత్తా చూపించారని ఆయన అన్నారు.
కొందరు మాజీ కేంద్ర మంత్రులను క్షమించకూడదని ఆయన అన్నారు. లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి ఏం చేశారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తొలుత ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ప్రసంగించారు.