బాబు కానుక: ఎమ్మెల్యేలకు రూ.3కోట్లు!, బీజేపీపై..
హైదరాబాద్: అభివృద్ధి పథకాల కోసం పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. మంచినీటి పథకాలు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు వీటిని మంజూరు చేస్తారు.
ప్రతి శనివారం తన సమయాన్ని పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులకు కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ శనివారం లేక్ వ్యూ అతిథి గృహంలో సుమారు 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులతో ఆయన సమావేశమయ్యారు.
ముందుగా వారందరితో కలిసి ఒకసారి, ఆ తర్వాత కొందరు పార్టీ ముఖ్యులతో మరోసారి చంద్రబాబు భేటీ అయ్యారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. పార్టీ ముఖ్యుల సమావేశంలో.. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు చిన్నచిన్న పనులకు కూడా నిధులు మంజూరు చేయలేకపోతున్నామని, ఇబ్బందిగా ఉంటోందన్న అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ఉందన్న అంశం చర్చకు వచ్చింది.

దాంతో, నియోజకవర్గానికి మూడు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. కాగా, చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా ఇవ్వనున్న పండగ సరుకులను జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని, రేషన్ షాపుల వద్దే వీరు పంపిణీని పర్యవేక్షించాలని నిశ్చయించారు.
తద్వారా, సరుకులు పక్కదారి పట్టకుండా నిజమైన లబ్ధిదారులకే చేరతాయని భావించారు. సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకొని ఈనెల పింఛన్లను 15వ తేదీలోపే పంపిణీ అయ్యేలా చూడాలని నిర్ణయించారు. పింఛనుదారులకు ఇళ్ల వద్దే వాటిని పంపిణీ చేసేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరగా.. దానిపై పరిశీలన జరుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాగా, రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో కొన్నింటిని బీజేపీ అడుగుతోందనే విషయం చర్చకు వచ్చింది. కేంద్రంలోని కొన్ని నామినేటెడ్ పదవులను కూడా మనం అడుగుతున్నామని, ఆ పార్టీ నేతలు ఇక్కడ అడుగుతున్నారని, దీని పైన పరిశీలించాలని చంద్రబాబు అన్నారు. కాగా, 19వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉండనుంది.












Click it and Unblock the Notifications